ఏడాదికి వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ.. సంక్రాంతి పండుగ వస్తుందంటేనే స్వస్థలాలకు వెళ్లాలని, మన వాళ్ల మధ్య పండుగ జరుపుకోవాలని మనస్సు ఊవిళ్లూరుతోంది. దానికి తగ్గట్లుగా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. ప్రయాణానికి సంబంధించిన టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు షాపింగ్, బహుమతులు, అక్కడ ఉండబోయే రోజులకు అయ్యే ఖర్చులన్నీ బేరీజు వేసుకుంటాం.
పిల్లలను తీసుకుని ఈ పండుగ రోజుల్లో అమ్మ, అత్తవారింట్లో, కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఉత్సాహం చూపిస్తాం. ప్రయాణించే రోజు కోసం ఎదురు చూస్తుంటాం. ఊరెళ్లేందుకు అవసరమైనవన్నీసిద్ధం చేసుకుని.. ఏదైనా మిస్ అయ్యామా అని హైరానా పడిపోతాం. అయితే ఈ కంగారులో అనేక విషయాలు మర్చిపోతుంటాం. ఒక చోట పెట్టాల్సిన వస్తువులు మరో చోట పెట్టేయడం వంటి పనులు ప్రతి ఇళ్లలోనూ పరిపాటే. ఇంట్లో అందరినీ కంగారు పెట్టేసి.. అసలు విషయాలను మర్చిపోతారు.
మీరు ఊరెళ్లుందుకు అన్ని ప్యాక్ చేసుకున్నారా.. మీ ఇల్లు ప్యాక్ కాకుండా చూసుకోవాల్సి బాధ్యత కూడా మనదే. సొంతూరికి వెళ్లాలని, మన వాళ్లను చూడాలన్న తొందరలో..ఇంటికి, బీరువాలకు, లాకర్స్ కు సరిగా తాళాలు వేయం. ఇదే అదును చూసుకుని దొంగలు సైతం ఇంటిని గుల్ల చేసిన దాఖలాలు ఎన్నో. ఇటువంటి సమస్యల నుండి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. విలువైన వస్తువులను లాకర్స్ లో ఉంచి తాళాలు వేసి.. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. వెళ్లే ముందు ఇంట్లో లైట్లు వేసి ఉంచడంతో పాటు పొరిగింటి, ఎదురింటి వారికి తమ ఇంటిని చూస్తుండమని చెప్పాలి. సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. పాలు, పేపర్ వాళ్లను తాము లేనన్నీ రోజులు ఇంటికి రావద్దని చెప్పాలి. ఇలా చేయడం వల్ల దొంగలు, దోపిడీ దారులను నుండి ఇంటిని సురక్షితంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు సైబరాబాద్ పోలీసులు.