ఊహించని ప్రమాదాలు ప్రాణాలను తీసుకుంటున్నాయి. సరదాగా ఈతకు వెళ్లిన చిన్నారులు.. నీట మునిగిన సంఘటనలు చూశాం. అలాగే విహార యాత్రలకు వెళుతూ ప్రమాదం బారిన పడి తిరిగిరాని లోకాలకు మరలి వెళిపోతుంటారు.
ఊహించని ప్రమాదాలు ప్రాణాలను తీసుకుంటున్నాయి. సరదాగా ఈతకు వెళ్లిన చిన్నారులు.. నీట మునిగిన సంఘటనలు చూశాం. అలాగే విహార యాత్రలకు వెళుతూ ప్రమాదం బారిన పడి తిరిగిరాని లోకాలకు మరలి వెళిపోతుంటారు. కొన్ని సార్లు కుటుంబాలకు కుటుంబాలు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటనలు విన్నాం. ఈ ఊహించని విపత్తుకు ఎవ్వరిని నిందించాలో తెలియక.. మౌన రోదన మాత్రమే మిగిలిపోతుంది. ఇక బుడి బుడి అడుగులు వేసే బుజ్జాయిలు.. చనిపోతే తల్లి గర్భశోకం తల్లిడిల్లిపోతుంది. ఇదే జరిగింది నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో. అప్పటి వరకు తుళ్లుతూ, కేరింతలు కొడుతున్న చిన్నారి.. క్షణికంలో మృత్యువాత పడింది.
వివరాల్లోకి వెళితే.. ఎత్తోండ గ్రామంలో నీటి బకెట్లో పడి 16 నెలల చిన్నారి వేదశ్రీ మరణించింది. గ్రామానికి చెందిన కేశవ్, గంగామణి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు. కేశవ్ దంపతులు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే సోమవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు ఇంటిపనుల్లో నిమగ్నమవ్వగా.. చిన్న కుమార్తె వేద ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ నీళ్లు ఉన్న బకెట్లో పడిపోయింది. అందులో ఊపిరి ఆడక మునిగిపోయింది. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బోధన్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు. బుడిబుడి అడుగులు వేసే పసిబిడ్డ విగత జీవిగా మారే సరికి ఆ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.