ఇటీవల వైజాగ్లో జరిగిన కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు ఎంతటి సంచలనం కలిగించిందో అందరికీ తెలుసు. బంగారం లాంటి భర్తను, ముత్యాల్లాంటి బిడ్డలను కాదని ఆటో డ్రైవర్ రామారావు మోజులో పడి జీవితాన్నే నాశనం చేసుకుంది శివాని.
ఇటీవల వైజాగ్లో జరిగిన కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు ఎంతటి సంచలనం కలిగించిందో అందరికీ తెలుసు. బంగారం లాంటి భర్తను, ముత్యాల్లాంటి బిడ్డలను కాదని ఆటో డ్రైవర్ రామారావు మోజులో పడి జీవితాన్నే నాశనం చేసుకుంది శివాని. చివరకు అతడి ఉద్యోగం, ఆస్తిపై కన్నేసిన శివాని.. భర్తతో ప్రేమ నటించి, చక్కగా మటన్ వండి, ఆపై మత్తు మందు కలిపిన మద్యం తాగించి.. నిద్రమత్తులో జారుకుంటుండగా దిండు మొహంపై అదిమి చంపి.. ఆ తర్వాత నంగనాచీలా పొద్దున్న లేచేసరికి ఇలా పడిపోయి ఉన్నాడంటూ భోరున విలపించింది. గుండెపోటుతో చనిపోయాడని చిత్రీకరించేందుకు ట్రై చేసింది. ఈ తరహా సంఘటనే ఇప్పుడు మరొటి వెలుగులోకి వచ్చింది.
రెండో భార్య మోజులో పడి.. మొదటి భార్యను చంపి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెదక్ మండలం తిమ్మక్కపల్లి తండాకు చెందిన కాట్రోత్ రమేశ్కు కౌడిపల్లి మండలం మహబూబ్నగర్ తండాకు చెందిన స్వరూపకు పదేళ్ల కిత్రం వివాహమైంది. వారికి ఒక బాబు జన్మించాడు. కాగా, రమేశ్ ఇటీవల తిమ్మక్కపల్లి తండాకు చెందిన మంజుల అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుండి మొదటి భార్యను, బిడ్డను సరిగ్గా పట్టించుకోవడం లేదు. దీనిపై ఆమె నిలదీయగా.. వదిలించుకోవాలని కుట్ర పన్నాడు. వెంటనే దాన్ని అమలు చేశాడు.
పురుగుల మందు తీసుకువచ్చి స్వరూపతో బలవంతంగా తాగించాడు. అపస్మారక స్థితిలోకి చేరుకోగానే ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి పురుగు మందు తాగిందని చెప్పాడు. అనంతరం ఆమెను మెదక్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా.. ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించింది. భర్త రమేశ్ తో పాటు రెండవ భార్య మంజులపై స్వరూప తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వీరి వేధింపులు గురి చేశారని, తన అల్లుడే ఆమెకు పురుగుల మందు తాగించాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.