మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బౌలర్స్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న వీవీఎస్ లక్ష్మణ్ అనే ఓ తెలుగు కుర్రాడిని బ్యాటింగ్ ఆర్డర్ లో కాస్త ముందుకి పంపించాడు. చివరిలో టీమ్ కి వెన్నముకగా నిలవాల్సిందిగా ద్రవిడ్ కి బాధ్యతలు అప్పగించాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బౌలర్స్ నిప్పులు కురిపించారు. కానీ.. ఈసారి టీమిండియా బ్యాటింగ్ అప్రోచ్ మారింది.
ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటేనే భయపడుతున్న రోజులవి.. చిత్తుగా ఓడకుంటే చాలు దేవుడా! అని అనుకోని జట్టు లేదు. స్టీ వా, షేన్ వార్న్, మ్యాథ్యూ హేడెన్, మెక్గ్రాత్, పాంటింగ్, జస్టిన్ లంగర్ లాంటి హేమాహేమీలతో ఆసీస్ భీకరంగా ఉంది. ప్రపంచ క్రికెట్ను ఒంటిచేత్తో శాసిస్తున్న ఆస్ట్రేలియా.. కేవలం తమ వరుస విజయాల కౌంట్ను పెంచుకునేందుకు 2001లో భారత్కు వచ్చింది. టీమిండియాపై గెలవడం తమకు తలదువ్వుకున్నంత ఈజీ అంటూ మ్యాచ్కు ముందే ప్రకటించి.. భారత జట్టుపై తమకున్న చులకన భావాన్ని స్పష్టం చేసింది ఆస్ట్రేలియా. కానీ.. ఒక్కడు మాత్రం తెగించి ఆసీస్కు ఎదురుతిరిగాడు.. అతని పేరు సౌరవ్ గంగూలీ అలియాస్ దాదా. ఆ ఒక్కడి ధైర్యం ఆసీస్ గర్వాన్ని అణిచివేసింది. ఆ ఒక్క కోల్కత్తా టెస్టు భారత క్రికెట్ తలరాతను సమూలంగా మార్చివేసింది. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు పసికూన టీమిండియా ఎలా బుద్ధిచెప్పింది. పిల్లిలా ఉన్న మన జట్టును గంగూలీ పులిలా ఎలా మార్చాడు? దానికి కలకత్తా టెస్ట్ ఎలా వేదిక అయ్యింది? ఆ క్రమంలో గంగూలీని ఆస్ట్రేలియా జట్టు ఎంత తీవ్రంగా దూషించి అవమానించింది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
90వ దశకంలో.. సచిన్ కరెక్ట్గా నిలబడి బ్యాటింగ్ చేస్తే.. ప్రపంచంలో అతన్ని అవుట్ చేసే బౌలరే లేడు. రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ అడ్డుగా నిలబడిపోయారంటే.. చైనా వాల్ కూడా పనికిరాదు. కానీ.. ఆస్ట్రేలియా లాంటి మైండ్గేమ్ తెలిసిన జట్టును ఓడించాలంటే ఇవి సరిపోవు.. ఇంకేందో కావాలి. అందేంటో అప్పటి టీమిండియా కుర్ర కెప్టెన్ సౌరవ్ గంగూలీకి బాగా తెలుసు. కానీ.. మైండ్గేమ్లో ఆరితేరిన ఆస్ట్రేలియాను కొట్టడం అంత సులువా.. కాదు! ప్రత్యర్థి జట్టు మైండ్ గేమ్ ఆడుతుందని తెలిస్తే.. ఆస్ట్రేలియాన్లు ఆడే మైండ్గేమ్ చాలా దారుణంగా ఉంటుంది. తల్లి, చెల్లి, పెళ్లాం, పిల్లలు అంటూ ఎంతకైనా తెగిస్తారు. అయినా.. కూడా టీమిండియా యువ కెప్టెన్ గంగూలీ ఆస్ట్రేలియాతో ‘మైండ్గేమ్’ యుద్ధానికి సిద్ధమయ్యాడు.
2001లో మూడు టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చింది. క్రికెట్లో మైండ్గేమ్కు పెట్టింది పేరైన అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవా.. సిరీస్ ఆరంభానికి ముందే దాన్ని అమలులో పెట్టాడు. అప్పటికే వరుసగా 15 టెస్టులు గెలిచి ఉన్న ఆస్ట్రేలియాకు భారత్తో మూడు టెస్టులు.. 16, 17, 18 నంబర్లుగా మారుతాయని స్టీవ్ వా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అంటే టీమిండియా తమకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేదని.. కేవలం తమ విన్నింగ్ కౌంట్ను పెంచుకునేందుకే భారత్తో టెస్టు సిరీస్ ఆడుతున్నామనే చిన్నచూపుతో స్టీవా అలాంటి కామెంట్ చేశాడు.
ఇక అన్నట్లు గానే.. తొలి టెస్టులో టీమిండియాను ఓడించింది ఆస్ట్రేలియా. కానీ.. ఆస్ట్రేలియాతో మైండ్ గేమ్ ఆడాలని ఫిక్స్ అయిన గంగూలీ.. తొలి టెస్టులో టాస్ కోసం ఆలస్యంగా వచ్చి.. తన కోసం స్టీవాను వేచి చూసేలా చేసి ఆస్ట్రేలియన్ల ఈగోను టచ్ చేశాడు. అలాగే ఒక్క మ్యాచ్ కూడా ఆడని హేమంగ్ బదాని అనే ప్లేయర్ ను సబ్స్టిట్యూడ్గా ఆడించి.. స్టీవాను స్టెడ్జింగ్ చేయించి.. పుండుపై కారం చల్లాడు. రెండో టెస్టుకు వచ్చే సరికి గంగూలీ మైండ్గేమ్ ఆస్ట్రేలియన్లకు అర్థమైపోయింది. రెండో టెస్టుకు కూడా టాస్ కోసం ఆలస్యంగా వచ్చిన గంగూలీ కావాలనే ఆస్ట్రేలియా కెప్టెన్ను ఎదరుచూసేలా చేస్తున్నాడని ఆసీస్ కి అర్ధమైపోయింది. దీంతో బూతులు తిట్టడంలో ఆరితేరిన ఆస్ట్రేలియా జట్టుకు గంగూలీ టార్గెట్గా మారిపోయాడు.
2001 మార్చ్ 11న కలకత్తా టెస్ట్ ప్రారంభమైంది. కసితో ఉన్న ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో 445 పరుగులు సాధించింది. కెప్టెన్ స్టీవ్ వా ఏకంగా సెంచరీ బాదేశాడు. తరువాత బౌలింగ్ కూడా ఆసీస్ ది అదే కసి. 40 పరుగులకే ఓపెనర్స్ తో సహా సచిన్, ద్రవిడ్ పెవిలియన్ చేరారు. అలాంటి క్లిష్ట సమయంలో క్రీజ్ లోకి వచ్చిన గంగూలీని చుట్టు ముట్టేసింది ఆస్ట్రేలియా టీమ్. 11 మంది ఆటగాళ్లు దాదాపై మాటల దాడికి దిగారు. అప్పట్లో గంగూలీకి సినీ హీరోయిన్లతో అఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని టార్గెట్ చేసి.. “ఎవరామె? బాగుంటుందా?” అంటూ గంగూలీతో స్లెడ్జింగ్ చేశారు.
ఏకంగా గంగూలీ పర్సనల్ లైఫ్ వరకు వెళ్లిందా దాడి. “ఏంటి.. నీ సెక్స్ లైఫ్ ఎలా ఉంది? ఏమైనా ప్రాబ్లమ్ ఉందా?” అంటూ గంగూలీని దారుణంగా స్లెడ్జింగ్ చేశారు. ఇలా ఒక్క ఆటగాడిపై 11 మంది ఏకధాటిగా దాడిచేస్తే.. ఎవరి రక్తమైనా సలసలా మరిగిపోతుంది.. అలానే గంగూలీలో కూడా కోపం కట్టులు తెంచుకుంది. అదే ఆవేశంలో ఏకాగ్రత కోల్పోయి అవుట్ అయ్యాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 170 పరుగులకే ఆలౌట్. ఒక్క లక్ష్మణ్ తప్పా.. ఎవ్వరూ ఆసీస్ దూకుడిని తట్టుకుని నిలువలేకపోయారు. దీంతో.. ఇండియా ఫాలోఅన్ ఆడాల్సి వచ్చింది. ఇదే అదునుగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు మళ్ళీ నోటికి పనిచెప్పారు.” ఇండియాతో మ్యాచ్ ఆడుతుంటే బోర్ కొడుతుంది. కనీసం ఫాలోఅన్ కూడా తప్పించుకోలేకపోతున్నారంటూ” జబ్బలు చరిచారు. గంగూలీ ఇవన్నీ వింటున్నాడు. ఆ మాటలే దాదాలో కసిని పెంచాయి. కంగారుల అహానికి కలకత్తా గడ్డ మీదే బుద్ధి చెప్పాలని మన రాయల్ బెంగాల్ టైగర్ ఆ క్షణానే నిర్ణయించుకున్నాడు.
సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యే ముందు టీమ్ మొత్తాన్ని సమావేశపరిచాడు. ఆస్ట్రేలియా సీనియర్స్ అహానికి, మన యంగ్ టీమ్ కి జరుగుతున్న పోరు ఇది. ఆ సీనియర్స్ కు భయపడకండి. అసలు వారికి అనవసరపు గౌరవం ఇవ్వకండి. వాళ్ళు మనకన్నా బాగా ఆడుతారన్న ఆలోచన మీలో నుండి తీసేయండి. సరిగ్గా ఆడితే ఎవరైనా.. ఎవరినైనా ఓడించవచ్చు అంటూ టీమ్ లో స్ఫూర్తిని నింపాడు. అయితే.. కేవలం మాటలతో మందిని ముందుకు నడపడం సాధ్యం కాదు కదా? అందుకే.. అప్పటికప్పుడు వ్యూహాలు కూడా రచించాడు దాదా. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బౌలర్స్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న వీవీఎస్ లక్ష్మణ్ అనే ఓ తెలుగు కుర్రాడిని బ్యాటింగ్ ఆర్డర్ లో కాస్త ముందుకి పంపించాడు. చివరిలో టీమ్ కి వెన్నముకగా నిలవాల్సిందిగా ద్రవిడ్ కి బాధ్యతలు అప్పగించాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బౌలర్స్ నిప్పులు కురిపించారు. కానీ.. ఈసారి టీమిండియా బ్యాటింగ్ అప్రోచ్ మారింది.
శివ సుందర్ దాస్, సదగోపన్ రమేశ్ టీమిండియాకు శుభారంభాన్ని అందించింది. ఈ ఇద్దరు ఓపెనర్లు 50 ప్లస్ స్కోర్ అందించి.. ఆస్ట్రేలియా బౌలింగ్ను లెక్కచేయకుండా ఆడారు. ఒక తొలి వికెట్గా 30 పరుగులు చేసి రమేష్ అవుటైన తర్వాత గంగూలీ ప్లాన్ ప్రకారం.. తొలి ఇన్నింగ్స్ బాగా ఆడిన వీవీఎస్ లక్ష్మణ్ వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చి.. అవుట్ అవ్వడం అంటే ఏంటో తెలియదన్నట్లు ఆడాడు. కానీ.. సచిన్ టెండూల్కర్ 10 పరుగులు చేసి వెంటనే అవుటైనా.. గంగూలీ మాత్రం లక్ష్మణ్తో కలిసి 117 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మిస్తాడు. కానీ.. ఆస్ట్రేలియాన్ల మాటల దాడితో దాదా ఏకాగ్రతను మళ్లీ చెడగొట్టి దొంగదెబ్బ తీస్తారు. ఇక గంగూలీ చెప్పినట్లు రాహుల్ ద్రావిడ్, లక్ష్మణ్తో కలిసి చరిత్రలో నిలిచపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఏదిఏమైనా వికెట్ మాత్రం ఇవ్వద్దని దాదా చెప్పిన విషయాన్ని మనసులో పెట్టుకుని లక్ష్మణ్-ద్రవిడ్ జోడి ఆసీస్ బౌలర్లను మూడు చెరువుల నీళ్లు తాగించింది. టీ బ్రేక్లు, లంచ్ బ్రేక్లు తీసుకుని.. ఆడుతూనే ఉంటారు ఇద్దరు. గంగూలీ నూరి పోస్తున్న స్ఫూర్తితో వారిలో మరింత ఉత్సాహం వస్తుంది.
చివరిగా 376 పరుగుల చరిత్ర సృష్టించిన భాగస్వామ్యానికి తెరదించుతూ.. 281 పరుగులు చేసి లక్ష్మణ్ అవుట్ అవుతాడు. ఒక చివరిగా 180 పరుగులు చేసిన ద్రవిడ్ వికెట్ పడటంతో 657 పరుగుల వద్ద 7 వికెట్లు కోల్పోయిన దశలో గంగూలీ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి.. డేరింగ్ నిర్ణయం తీసుకుంటాడు. ఇక బౌలింగ్లో.. హర్భజన్ సింగ్ తన స్పిన్ మయాజాలంతో 6 వికెట్లు పడగొట్టి.. ఆసీస్ పతనాన్ని శాసిస్తాడు. భజ్జీకి సచిన్ కూడా 3 వికెట్లతో మద్దతుగా నిలుస్తాడు. దీంతో 212 పరుగులకే ఆస్ట్రేలియాను కుప్పకూల్చి.. ఏకంగా 171 పరుగుల తేడాతో టీమిండియా చారిత్రత్మక విజయం సాధిస్తుంది. ఫాలో ఆన్ ఆడి టెస్టు గెలిచిన జట్టుగా చరిత్రలో నిలిచిపోతుంది. ఆ తర్వాత.. చెన్నైలో జరిగిన మూడో టెస్టులో బౌలింగ్లో హర్భజన్ సింగ్ 15 వికెట్లతో చెలరేగడంతో.. తొలి ఇన్నింగ్స్లో సచిన్ సెంచరీ, రెండు ఇన్నింగ్స్లో లక్ష్మణ్ హాఫ్ సెంచరీతో రాణించడంతో మూడో టెస్టులోనూ ఆస్ట్రేలియాలను మట్టికరిపించి.. టీమిండియా 2-1తో సిరీస్ విజయం సాధించి.. ఆస్ట్రేలియా గర్వాన్ని అణిచివేస్తుంది. ఈ సిరీస్ విజయంతో టీమిండియా ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా కూడా ఒక సాధారణ జట్టే అనే విషయం చాటి చెప్పింది.
ఇలా.. ఒక సాధారణ జట్టులో ఇంతటి తెగువ, ధైర్యం, నమ్మకాన్ని కలిగించింది మాత్రం కెప్టెన్ గంగూలీనే. ఆస్ట్రేలియా ఏమన్న ఆకాశం నుంచి ఊడిపడిందా.. వాళ్లు ఆడితే మనం ఆడలేమా, వాళ్లు కొడితే మనం కొట్టలేమా.. వాళ్లు గెలిస్తే మనం కూడా గెలుస్తాం అంటూ జట్టులో కసి పెంచాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా అనే భయాన్ని అందరిల్లోంచి తరిమికొట్టాడు. అందుకే ఇండియన్ క్రికెట్ చరిత్రలో గంగూలీ అంటే పేరు కాదు.. అదో ధైర్యం. టీమిండియా తలరాతను మార్చిన వీరుడు. అతని కెప్టెన్సీలో ఈ సిరీస్ విజయంతో టీమిండియా ఆటను చూసే దృక్కోణమే మారిపోయింది. ఇకపై బరిలోకి దిగితే గెలవడానికే ఆడుతున్నాం అనే కసి కనిపించింది. ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం టీమిండియా వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్గా ఉందంటే.. అందుకు కారణం దాదా. టీమిండియా కెప్టెన్గా గంగూలీ వరల్డ్ కప్పు కొట్టకపోవచ్చు కానీ.. గొప్ప జట్టుగా మార్చాడు.