జాతీయ జెండా అంటే గుడ్డ కాదు, ఈ దేశపు గుండె. ఈ దేశంలో నివసించే ప్రతీ మనిషి గుండె చప్పుడు మన జాతీయ జెండా. అటువంటి జెండాను ఎలా పడితే అలా వాడకూడదు. నేల మీద పడేసినా, జెండా రంగులు మార్చినా, జెండా పట్ల నిర్లక్ష ధోరణితో ప్రవర్తించినా శిక్షార్హులు. అలాంటిది కొందరు టీఆర్ఎస్ నాయకుల అనుచరులు ఏకంగా జాతీయ జెండాపై తమ నాయకుల ఫోటోలను ముద్రించారు. అక్కడితో ఆగకుండా జాతీయ జెండాను ఫ్లెక్సీలా కట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశమంతటా ఇవాళ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జతీయ జెండాను ఎగురవేశారు. గతంలో కంటే ఈసారి ఎక్కువగా ప్రతీ ఇంటా, ప్రతీ చోటా జాతీయ జెండా రెపరెపలాడింది. ప్రతీ చోటా, ప్రతీ నోటా జాతీయ గీతం వినిపించింది. అందరూ అత్యంత భక్తి, శ్రద్ధలతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
అయితే కొంతమంది అత్యుత్సాహవంతులు మాత్రం ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కూడా పబ్లిసిటీ పిచ్చి చూపించారు. పబ్లిసిటీ పిచ్చితో టీఆర్ఎస్ నేతల అనుచరులు జాతీయ జెండాను అవమానించారు. జాతీయ జెండాపై ఫోటోలను ముద్రించి ఫ్లెక్సీలా కట్టడం ఇప్పుడు ఆ పార్టీని చిక్కుల్లో పడేసింది. ఖుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ నేతల అత్యుత్సాహమో లేక వారి అనుచరుల అత్యుత్సాహమో తెలియదు గానీ ఈ దుస్సాహసం ఇప్పుడు ప్రజల ఆగ్రహానికి వేదికైంది. ఫ్లెక్సీపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఫోటోతో పాటు, మరో స్థానిక టీఆర్ఎస్ నేత ఫోటోను ముద్రించారు. ఖుత్బుల్లాపూర్లోని స్కై ఫుట్పాత్పై ఎమ్మెల్యే అనుచరులు జాతీయ జెండాను ఫ్లెక్సీగా కట్టారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కారణం కేసీఆర్ అంటూ ఓ నేత టంగ్ స్లిప్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం మరువక ముందే అదే పార్టీకి చెందిన ఇద్దరు నేతలకు సంబంధించిన ఫోటోలు ఇలా జాతీయ జెండాపై కనబడడం ప్రజల ఆగ్రహావేశాలకు గురి చేస్తున్నాయి. ఇది వారికి తెలిసి జరిగిందో లేక తెలియక జరిగిందో తెలియదు కానీ దీనిపై ఆ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. మరి జాతీయ జెండాపై ఇలా నాయకుల ఫోటోలను ముద్రించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.