ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మరోసారి అధికారం దక్కిచుకునేందుకు భారీ హామీలతో మేనిఫెస్టో ప్రవేశపెట్టింది. ఈసారి మేనిఫెస్టోలో రైతులకు పెద్దపీట వేసినట్లు తెలుస్తుంది. ఇదివరకు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సాగుచట్టాలు, రైతుల పైకి మంత్రి కారు ఎక్కించడం వంటి మచ్చలను మేనిఫెస్టోతో మాపుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. రైతులకు ప్రాధాన్యతనిస్తూ యూపీ సంకల్ప్ పత్ర్ పేరుతో కేంద్రమంత్రి అమిత్ షా, యోగి ఆదిత్యానాథ్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు.
ప్రస్తుత ఎన్నికలలో రైతులు, మహిళల ఓటర్లను టార్గెట్ చేసి హామీలు భారీగా ప్రకటించారు. రాష్ట్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని, 15 రోజుల్లోనే చెరుకు పంట బకాయిలు చెల్లిస్తామని యోగి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇది కేవలం ఎన్నికల మేనిఫెస్టో కాదని, ఇది రాష్ట్రంలోని 24 కోట్ల జనాభాకు లోక కళ్యాణ సంకల్ప్ పత్రమని సీఎం యోగి స్టేట్మెంట్ ఇచ్చారు.
ఇక యూపీ మహిళలపై బీజేపీ మేనిఫెస్టో వరాలు కురిపించింది. రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని, కన్యా సుమంగళ యోజన పథకం కింద అందించే రూ. 15వేల ఆర్థిక సాయాన్ని 25 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. అలాగే హిందూ అమ్మాయిల జోలికి ముస్లిం యువకులు రాకుండా యూపీలో లవ్ జిహాద్ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేస్తామని బీజేపీ మేనిఫెస్టో తెలిపింది. సీఎం యోగి మాట్లాడుతూ.. దేశంలో అతిపెద్దదైన మన రాష్ట్రాన్ని ఆర్థికాభివృద్ధిలో కూడా మెరుగైన స్థానంలో నిలుపుతామని మేనిఫెస్టో ద్వారా హామీ ఇచ్చారు. చివరిగా మరో ఆరు నూతన మెగా ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది బీజేపీ ప్రభుత్వం.