రామోజీరావు.. టోటల్ ఇండియాలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. రాష్ట్రాలను పాలించే నాయకులను సైతం కంటి చూపుతో శాసించిన ఘన చరిత్ర ఆయనది. దేశంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.., రామోజీ రాజ్యాన్ని టచ్ చేసే దైర్యం చేయరు. అంతటి శక్తికి మొదటిసారి ఎదురు నిలిచిన ఒకే ఒక వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్. అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి. ప్రభుత్వం ఏ పని చేసినా రామోజీ మీడియా.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. రామోజీరావు దూకుడిని అడ్డుకోవడానికి రాజశేఖర్ రెడ్డికి ఒక అస్త్రం కావాల్సి వచ్చింది. సరిగ్గా అలాంటి సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 45S అనే ఒక యాక్ట్ ని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రభుత్వం ముందుకి తీసుకొచ్చారు.
ఆ యాక్ట్ ప్రకారం ఎవరైనా ప్రజల నుండి డిపాజిట్స్ సేకరించడం తప్పు. కానీ.., రామోజీరావు మార్గదర్శిలో జరిగింది ఇదే. దీంతో.. ఉండవల్లి కేవలం ఒక ఫిర్యాదుదారుడిగా ఈ అంశాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో.., అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై కోర్టులో ఒక కేసు వేసింది. తరువాత ఈ కేసు ట్రయిల్ కోర్టులో వాయిదాల మీద వాయిదాలు పడుతూ, రాష్ట్రం విడిపోయాక, ఉమ్మడి హైకోర్టుకి చేరింది. ఇక్కడ.., ఇంప్లీడ్ చేసింది ఒక్క తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రమే. అప్పుడు తెలంగాణలో ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్ ఎన్నికలకి వెళ్లి ఉన్నారు. కాబట్టి.. అప్పటి ఆపద్ధర్మ ప్రభుత్వం ఈ కేసులో రామోజీ తప్పు చేసినట్టు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో.. 2018 డిశంబర్ 31నాడు హై కోర్టు జడ్జి.. రామోజీపై ఉన్న క్రిమినల్ చార్జెస్ కొట్టేశారు. కానీ.., ఈ విషయం అస్సలు బయటకి రాలేదు. ఇక్కడితో రామోజీరావుపై ఎలాంటి కేసు లేకుండా పోయింది. కానీ.., ఉండవల్లి అరుణ్ కుమార్ ఇక్కడతో తన పోరాటాన్ని ఆపలేదు.
ఓ సంవత్సరం తరువాత మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఢిల్లీలో ఉన్న సమయంలో అతనికి ఈ కేసు కొట్టేసినట్టు తెలిసింది. దీంతో ఆ తీర్పుని సవాలు చేస్తూ సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు ఉండవల్లి. మార్గదర్శి డిపాజిట్స్ సేకరణ రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగింది. అలాంటప్పుడు ఒక్క తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రమే ఇంప్లీడ్ చేసి ఈ కోర్టులో తీర్పు ఎలా ఇస్తారని ఉండవల్లి సుప్రీం కోర్టులో పోరాడారు. ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనతో సర్వోన్నత న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో.., సుప్రీం కోర్టు ఈసారి ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఇంప్లీడ్ చేస్తూ.., వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఇదంతా జరిగి కూడా సంవత్సరం అవుతోంది. ఇక అప్పటి నుండి ఈ కేసు ఏమైందో కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ.., తాజాగా ఈ కేసులో సంచలన విషయాలను బయట పెట్టారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.
సుమన్ టీవీ ప్రతిష్టాత్మకంగా.. “జర్నలిస్ట్ డైరీ సుమన్ టీవీ ఇన్సియేటివ్” కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఈ కార్యక్రమానికి మొదటి గెస్ట్ గా ఉండవల్లి అరుణ్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సతీశ్ బాబు ఈ కేసు వివరాలను అడగ్గా.., ఉండవల్లి అసలు నిజాలను బయటపెట్టారు. “సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసులు ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఈ కేసులో వివరణ ఇవ్వాల్సి ఉంది. కానీ.., ఇప్పటి వరకు రెండు ప్రభుత్వాలు ఆ పని చేయలేదు. నేను రెండు రాష్ట్రాల్లోని ముఖ్య నేతలతో ఈ విషయం గురించి మాట్లాడాను. కానీ.., వారు రామోజీని ఢీ కొట్టడానికి సిద్ధంగా లేరు. ఈ విషయంలో కేసీఆర్, జగన్ ఇద్దరూ కూడా వ్యూహత్మకంగానే మౌనంగా ఉండిపోయారు” అని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలియచేశారు.
దీంతో.., ఈ కేసు విషయంలో జగన్, కేసీఆర్ ఇద్దరు కూడా రామోజీతో మిలాఖత్ అయిపోయారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.., నోటీసులు ఇచ్చింది సుప్రీం కోర్టు కాబట్టి.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా ఈ కేసు విషయంలో వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, లేకుంటే తాను మళ్ళీ ఈ కేసు విషయంలో సుప్రీంని ఆశ్రయించినా ప్రభుత్వాలకి వివరణ ఇవ్వక తప్పదని, ఆ తరువాత మళ్ళీ విచారణ మొదలవుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలియచేశారు. నిజానికి రామోజీరావుని ఇబ్బంది పెట్టే ఒక కేసు కళ్ళ ముందున్నా..జగన్, కేసీఆర్ ఇలా అటు వైపుగా స్పందించకపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా రామోజీరావు రూ.2,600 కోట్లు డిపాజిట్లు సేకరించారన్నది ప్రధాన ఆరోపణ. కానీ.., ఈ బిజినెస్ లో రామోజీ అందరికీ రూపాయితో సహా తిరిగి చెల్లించేశారు. కాబట్టి.., ఆయన్ని ఈ కేసులో డీఫాల్టర్ గా ఇరికించడం అసాధ్యం. కాకుంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 45S ప్రకారం డిపాజిట్స్ సేకరించడం చట్ట వ్యతిరేఖ చర్య. ఒకవేళ ఈ కేసు గనుక ఋజువైతే.. అంతకి రెండన్నర రెట్లు జరిమానా కట్టాల్సి వస్తుంది. అంటే ఆ జరిమానా మొత్తం విలువ 7 వేల కోట్ల రూపాయలు. పైగా.., రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. మరి.. రానున్న కాలంలో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.