విశాఖపట్నం- తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఆలయ ఓయస్డీ డాలర్ శేషాద్రి ఇక లేరు. ఆయన ఈ తెల్లవారు జామున హఠన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన డాలర్ శేషాద్రి సోమవారం ఉదయం గుండపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే లోపు కన్నుమూశారు.
డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీరని నష్టమని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేనిదని అన్నారు. టీటీడీ అధ్వర్యంలో విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద కార్తిక మహా దీపోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయగా అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.
డాలర్ శేషాద్రి 1978 నుంచి శ్రీవారి సేవలో తరిస్తున్నారు. 2007లో పదవీవిరమణ పొందినా, డాలర్ శేషాద్రి సేవలు తిరుమల తిరుపతి దేవస్థానంకు తప్పనిసరి కావడంతో ఓయస్డీగా కొనసాగించారు. డాలర్ శేషాద్రి తుది శ్వాస వరకూ స్వామి సేవలో తరించారు. తిరుమలకు వచ్చే ప్రముఖులకు తాను దగ్గరుండి స్వామి వారి దర్శనం చేసించేవారు.
డాలర్ శేషాద్రి మృతితో తరుమలలో విషాదం నెలకొంది. టీటీడీలోని ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్వామి వారికి, టీటీడీకి చేసిన సేవలను ఈ సందర్బంగా గుర్తుచేసుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. డాలర్ శేషాద్రి కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.