సాధారణంగా ఒక ప్లేట్ భోజనం హోటల్స్ లో అయితే దాదాపుగా రూ.100 పైనే ఉంటుంది. కానీ ఇక్కడ రూ.10కే కడుపునిండా భోజనం పెడుతున్నారు. అంతేకాకుండా రూ.10కే బిర్యానీ కూడా ఇస్తున్నారు.
అన్నం పరబ్రహ్మస్వరూపం. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లుగా మనం ఎన్ని పనులు చేసినా.. ఎంత సంపాదించినా కూడా కడుపు నింపుకోవడానికే. ప్లేట్ రైస్ హోటల్స్లో రూ. 100 ఉంటుంది. ఒక్క టీ తాగడానికే రూ. 10 ఖర్చు చేస్తాం. అలాంటిది పది రూపాయలకే కడుపు నిండా భోజనం పెడుతున్నారు. ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయలేని పేద రోగులకు సహాయం చేస్తూ రూ.10కే కడుపు నిండా భోజనం పెడుతుంది స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ. ఎంతో మంది అనాథలకు ఆశ్రయం కల్పించి ఎవరూ ఆకలితో ఉండకూడదనే భావనతో భోజనం అందిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వివేకానంద వృద్ధావ్రమంలో నిత్యాన్నదానం జరుగుతుంది. డాక్టర్ జహీర్ అహ్మద్ పర్యవేక్షణలో సేవా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. ఘోషాస్పత్రికి ప్రసవాల కొరకు దూరప్రాంతాల నుంచి వచ్చిన వారికి భోజనానికి ఇబ్బందులు పడకుండా ఈ సంస్థ భోజనం అందిస్తుంది. కరోనా టైంలో కూడా కేజీహెచ్ లోని రోగుల అటెండర్స్, జీవీఎంసీ పారశుద్ధ్య సిబ్బందికి నిత్యాన్నదానం అందించింది ఈ సంస్థ. ఈ సంవత్సరం ఫిబ్రవరి 13 నుంచి రూ.10కే కడుపు నిండా భోజనం అందించడం మొదలుపెట్టింది. వాల్తేరు రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ ఛైర్మన్ మక్సూద్ అహ్మద్ సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 150 రోజులకు పైగా ఘోషాస్పత్రిలో రోగుల వెంట వచ్చిన అటెండర్స్ కు ‘అమృతాహార్’ పేరిట ఆహారం అందజేస్తుంది. మొదట ఇక్కడ 100 మందికి ఆహారం పెట్టేవారు. సంఖ్య పెరగడంతో ప్రస్తుతం 120 కి పెంచారు.
ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉందని వివేకానంద సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు తెలిపారు. దాతలు ముందుకొస్తే తక్కువ ధరలో అల్పాహారం కూడా అందించే ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. ఇక్కడ తయారుచేసే ఆహారం రుచిగా, శుచిగా ఉండాలన్నదే ఈ సంస్థ ఉద్దేశం. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ‘అమ్మవంట’ నూకాలమ్మ పర్యవేక్షణలో వివేకానంద సేవా సంస్థ మహిళలు వంట చేస్తారు. భోజనాన్ని శుభ్రంగా ప్యాక్ చేసి ఘోషాస్పత్రికి తీసుకొచ్చి పేషెంట్స్ అటెండర్స్కి అందిస్తారు.
వీరు అందించే భోజనం శుచి, శుభ్రతతో మేలు రకం బియ్యం, నూనెలతో వండుతారు. వంట కొరకు ప్రత్యేకంగా కట్టెల పొయ్యి ఏర్పాటు చేశారు. దీని ఖరీదు రూ. 1.80 లక్షలు. ప్రతీ 50 రోజులకు ఒకసారి రోగుల సహాయకులకు రూ.10కే బిర్యానీ అందిస్తున్నారు.