విశాఖపట్నం కానిస్టేబుల్ బర్రి రమేష్ హత్య కేసులో సినిమాను మించిన ట్విస్టులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రియుడితో శాశ్వతంగా జీవించేందుకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలన్న ఉద్దేశంతో అతడిని భార్య శివానీ అలియాస్ శివ జ్యోతి హతమార్చి గుండెపోటుగా చిత్రీకరించిందని అనుకున్నారు.
విశాఖపట్నం కానిస్టేబుల్ బర్రి రమేష్ హత్య కేసులో సినిమాను మించిన ట్విస్టులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రియుడితో శాశ్వతంగా జీవించేందుకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలన్న ఉద్దేశంతో అతడిని భార్య శివాని అలియాస్ శివ జ్యోతి హతమార్చి గుండెపోటుగా చిత్రీకరించిందని అనుకున్నారు. కానీ ఈ కుట్ర వెనుక మరో కోణం ఉందని తెలిసి విస్తుపోయారు పోలీసులు సైతం. ప్రియుడు రామారావు, అతడి స్నేహితుడు నీలా, శివజ్యోతిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మరొకరి పేరు బయటకు వచ్చింది. అసలు ఆమె ప్రియుడు రామారావుతో వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి ఆ వ్యక్తే కారణమైనట్లు శివానీ చెబుతుంది. ఇంతకు ఆమె ఎవరంటే..?
శివానీ పెద్దమ్మ కూతురు పైడమ్మ. శివానీకి అక్క వరుసైన పైడమ్మ ద్వారానే రామారావు పరిచయమనట్లు పోలీసులకు వెల్లడించింది. ఈ హత్య కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేష్ విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. అతడికి కొన్నాళ్ల క్రితం శివానితో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. ప్రస్తుతం ఎంవీపీ కాలనీలో ఆదర్శ్ నగర్లో నివాసముంటున్నారు. వీరి ఎదురింట్లోనే టాక్సీ డ్రైవర్ రామారావు నివసిస్తున్నాడు. శివజ్యోతి ఇంటి పక్కనే కారు పార్కింగ్ చేసేవాడు. అలా వారికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ భర్తకు దొరికిపోవడంతో.. రామారావుతో కలిసి ఉండాలని శివానికి చెప్పడంతో.. కొన్నాళ్లు బయటకు వెళ్లి జీవించారు. అయితే పెద్దలు నచ్చచెప్పడంతో తిరిగి రమేష్తో కాపురానికి ఓకే చెప్పింది. వచ్చిన తర్వాత కూడా అతడితో గొడవ పడుతూ.. పిల్లలను తనకు ఇవ్వాలంటూ వాదించేది.
దీనికి రమేష్ ససేమీరా అనడంతో అతడి అడ్డుతొలగించుకోవాలని అనుకుంది. దీనికి ప్రియుడు రామారావుతో కలిసి స్కెచ్ వేసింది. తన బంగారాన్ని తాకట్టు పెట్టి లక్షన్నర అతడికి ఇచ్చింది. రామారావు.. తన స్నేహితుడు నీలాకు రమేష్ను చంపేందుకు సుఫారీ ఇచ్చాడు. ఈ నెల 1వ తేదీన ఇంటికి వచ్చిన భర్తకు శివాని మందు తాగించి, వాటిని వీడియో తీసింది. భర్త నిద్రలోకి జారిపోగానే రామారావు, నీలాలను పిలిచింది. నీలా రమేష్ మొహంపై దిండు అదిమిపెట్టి చంపేయగా.. శివానీ కాళ్లు పట్టుకుంది. రామారావు ఎవ్వరూ రాకుండా బయట కాపలా కాశాడు. అయితే భర్త చనిపోతుండగా కూడా వీడియో తీసింది శివానీ. అనంతరం స్క్రీన్ ప్లేను అప్లై చేసింది. పొద్దున్నే లేచేసరికి భర్త అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని, గుండెపోటుతో చనిపోయినట్లు బంధువులను నమ్మించింది. అయితే అనుమానం వ్యక్తం చేసిన రమేష్ అన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు.. కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించగా.. ఊపిరాడక పోవడంతోనే చనిపోయినట్లు తెలిపింది. శివానినీ అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన అక్క పైడమ్మ ద్వారానే రామారావు పరిచయమయ్యాడని, మేము ముగ్గురం కలిసి బయటకు వెళ్లినట్లు చెప్పింది. ప్రియుడితో అక్కకు పరిచయం ఉందని తెలిపింది. ఫోన్ డేటాను పరిశీలించిన పోలీసులు ముగ్గురు తరచూ కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడినట్లు గుర్తించారు. అంతేకాకుండా తనకు కట్నం కింద ఇచ్చిన ఆస్థితో పాటు సాధారణంగా చనిపోతే భర్త ఉద్యోగం కూడా తనకు వస్తుందన్న అత్యాశతో.. అతడిని చంపి, గుండె పోటుతో చిత్రీకరించానని చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, కావాలనే శివాని తనను ఇరికిస్తుందని పైడమ్మ వాపోతుండటం విశేషం. ఆమెను కూడా ఈ కేసులో ముద్దాయిగా చేర్చి..విచారించే అవకాశాలున్నాయి.