హైదరాబాద్ఃతిరుమల- కలియుగ ప్రత్యక్ష్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నుంచే కాదు ప్రపంచ నలుమూలల నుంచి వస్తుంటారు. శ్రీవారి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో కొలువైనా అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కానీ ఇతర రాష్ట్రాల భక్తుల పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వ్యవహారిస్తున్న తీరు మాత్రం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
ప్రదానంగా మరో తెలుగు రాష్ట్రం, పొరుగునే ఉన్న తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు ఇచ్చిన సిఫారసు లెటర్స్ ను టీటీడీ తిరస్కరించడం విమర్శలకు తావిస్తోంది. తెలంగాణతో కృష్ణా జలాల వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరుమల అధికారులు తిరస్కరిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
టీటీడీ తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి తిరుమల వెంకన్న దర్శనం కోసం తీసుకెళ్తున్న సిఫారసు లేఖలను టీటీడీ పరిగణలోకి తీసుకోవడం లేదు. టీటీడీ వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్, జగన్ ప్రభుత్వాలు దేవుని దగ్గరా రాజకీయాలు మొదలుపెట్టాయని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ భక్తులు తిరుమలకు రావద్దా, ఇలాంటి వివాదాలు పెరిగితే రానున్న రోజుల్లో పెను తుపానుగా మారే ప్రమాదమూ ఉందని జగ్గారెడ్డి హెచ్చరించారు. మరి ఈ వివాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా స్పందిస్తున్నదే సర్వత్రా ఆసక్తి రేపుతోంది.