ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన 40 అంతస్థుల ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు మాసాల్లో ఈ ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్ధించింది. అలహాబాద్ హైకోర్టు 2017లో ఈ అక్రమాల్ని నిర్ధారించి కూల్చివేతకు ఆదేశాలిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ బిల్డర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ వాదనల తర్వాత టవర్స్ కూల్చివేతపై స్టే ఇచ్చిన కోర్టు, ఈలోపు కొనుగోలుదారులు ఎవరైనా డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే ఇచ్చేయాలని స్పష్టం చేసింది. చివరి తీర్పు ఇస్తూ ఈ జంట భవనాల కూల్చివేతను సమర్థించింది. నిర్మాణంలో ప్రమాణాలను పాటించలేదని, నిబంధనలను కూడా ఉల్లంఘించారని కోర్టు తెలిపింది. రెండు టవర్ల మధ్య ఉండాల్సిన గ్యాప్ లేదని చెప్పింది. టవర్లలో నివసించే వారి రక్షణ తమకు ముఖ్యమని స్పష్టం చేసింది.
నోయిడా అథారిటీ నుంచి ఎటువంటి పర్మిషన్ రాకముందే సూపర్టెక్ ఎమరాట్డ్ కోర్ట్ టవర్స్ నిర్మాణం మొదలుపెట్టేశారని, దీని గురించి తెలిసినా అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని ధర్మాసనం గుర్తించింది. నోయిడా అథారిటీ అధికారులు,బిల్డర్లు కుమ్మక్కయాయని ఇప్పటికే హైకోర్టు తేల్చిన విషయంలో వాస్తవం ఉందని పేర్కొంది. కామన్ ఏరియాలో అక్రమంగా ట్విన్ టవర్స్ నిర్మించినట్లు కోర్టు చెప్పింది ఈ టవర్ల నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ టవర్లను సూపర్ టెక్ సంస్థ నిర్మించింది. కూల్చివేతలకు అయ్యే ఖర్చును కూడా సూపర్ టెక్ సంస్థ నుంచే వసూలు చేయాలని ఆదేశించింది. ఇందులో ప్లాట్లు కొన్నవారికి 12 శాతం వడ్డీతో నగదును తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 915 ఫ్లాట్లకు, 21 షాప్లకు సంబంధించి, వాటి కొనుగోలుదార్లకు పరిహారం పూర్తిగా చెల్లించాల్సిందేనని చెప్పింది.
ఈ 40 అంతస్తుల అపార్ట్మెంట్లలో 633 ఫ్లాట్లు మొదట్లోనే బుక్ అయిపోయాయి. ఈ కోర్టు కేసుల తర్వాత 133 మంది కస్టమర్లు వేరే ప్రాజెక్టుల్లోకి మారిపోగా, 248 మందికి డబ్బులు తిరిగి ఇచ్చేశామని సూపర్ టెక్ బిల్డర్స్ యాజమాన్యం చెప్తోంది. మిగతా వారికి కూడా చెల్లింపులు చేస్తామంటోంది.