మహిళలపై దాడులకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నప్పటికి జరిగే ఘోరాలు మాత్రం ఆగడం లేదు. మణిపూర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అల్లరిమూక ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మణిపూర్ లో కొంత కాలం నుంచి మైతీ, కుకీ, నాగ తెగల మధ్య రిజర్వేషన్ విషయంలో రాజుకున్న వివాదం హింసకాండకు తెరలేపింది. మైతీ తెగకు ఎస్టీ హోదా ఇచ్చే విషయంలో తలెత్తిన వివాదం మణిపూర్ లో అల్లర్లకు దారితీసింది. ఈ అల్లర్లు పోనుపోను హత్యలకు మానభంగాలకు దారితీశాయి. సభ్య సమాజం తలదించుకునే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మణిపూర్ లో ఇద్దరు మహిళను వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ దేశవ్యాప్తంగా కలకలంరేపింది. సమాజం తలదించుకునేలా ఉన్న ఈ ఘటన రెండు నెలల క్రితం జరుగగా తాజాగా బయటపడింది. ఈ ఘటనపై మహిళా లోకంతో పాటు దేశం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిందితులకు ఉరిశిక్ష విధించాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.
కుకీ తెగకు చెందిన మహిళలపై మే 4న మైతీ ఆధిపత్యం ఉండే తౌబల్ జిల్లాలో కొందరు దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అల్లరి మూక ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి నడిపించారు. అంతటితో ఆగకుండా ఓ 19 ఏళ్ల యువతిపై పట్టపగలే సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన ఆ యువతి సోదరుడిని హత్యచేశారు. ఆమె తండ్రిని కూడా హతమార్చారు. ఈ లైంగిక వేధింపులపై మే 18వ తేదీన కాంగ్పోక్పి జిల్లాలో ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో మే 03వ తేదీన మైతీ తెగకు చెందిన సుమారు 1000మంది వ్యక్తులు తౌబల్ జిల్లాలో ఉన్న తమ గ్రామంపై దాడి చేశారని బాధితులు వెల్లడించారు. ఇళ్లకు నిప్పు పెడుతూ కుకీ తెగకు చెందిన మహిళలపై దాడులకు దిగుతుండడంతో.. ఇద్దరు మహిళలు, ఓ యువతి తండ్రి, సోదరుడితో కలిసి అడవుల్లోకి పరుగులు తీశారు. ఆ అల్లరి మూక వారిని వెంబడించి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మహిళలను బలవంతంగా బట్టలు విప్పించి నగ్నంగా ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశం నలుమూలల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఆ దుండగులపై జూన్ 21న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు. కాగా పార్లమెంట్ సమావేశాల ముంగిట అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి రావడంతో రాజకీయ దుమారం చెలరేగింది. మణిపూర్ అల్లర్లపై చర్యలేవి అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు రాజకీయ నాయకులు. నింధితులను కఠినంగా శిక్షించాలంటూ ప్రతి పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా ప్రతిపక్షాల ఒత్తిడితో ప్రధాని మోడీ పార్లమెంట్ ముందు మీడియాతో మాట్లాడుతూ.. నింధితులను కఠినంగా శిక్షిస్తామని, మణిపూర్ మహిళల పట్ల దారుణానికి పాల్పడిని వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనపై మణిపూర్ సిఎం బీరెన్ సింగ్ మాట్లాడుతూ.. మహిళలపై దాడి తనను కలచివేసిందని, మహిళలను వివస్త్రలను చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి జైలై 28న విచారణ చేసేందుకు నిర్ణయించింది. కాగా ఆ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే మణిపూర్ పోలీసులు రంగంలోకి దిగారు. దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి, మిగతా వారికోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.