గుంటూరు జిల్లా సంగం డెయిరీ వ్యవహారంలో హైకోర్టు జగన్ సర్కార్కు షాకిచ్చింది. సంగం డెయిరీ ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తూ ఇచ్చిన జీవోను కొట్టేసింది. ఆస్తులు అమ్మాలన్నా కొనాలన్నా కోర్టు అనుమతి తప్పనిసరని డైరెక్టర్స్ తమ విధులు నిర్వహించుకోవచ్చని కోర్టు సూచించింది. సంగం డెయిరీని ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 19కి వ్యతిరేకంగా డెయిరీ డైరెక్టర్లు పిటిషన్ దాఖలు చేశారు. సంగం డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణపై స్టే ఇవ్వాలని ధూళిపాళ్ల న్యాయవాదులు కోరారు. ధూళిపాళ్లకి కరోనా సోకటంతో విచారణ చేయలేని పరిస్థితి ఉందని కోర్టుకు సీఐడీ అధికారులు వెల్లడించారు. కస్టడీ పొడిగింపుపై ఏసీబీ కోర్టునే విచారణ చేయమని హైకోర్టు తెలిపింది. డెయిరీ స్థిర, చరాస్తులు అమ్మాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. డెయిరీపై ఆధిపత్యం డైరెక్టర్లకే ఉంటుందని తెలిపింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.