న్యూ ఢిల్లీ- ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాలో పర్యటించబోతున్నారు. డిసెంబర్ 6వ తేదీన న్యూ ఢిల్లీలో జరిగే భారత్ రష్యా వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. పుతిన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఈ బేటీలో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు దేశాధినేతలు చర్చిస్తారు.
రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని రష్యా రాయబార కార్యాలయం ధృవీకరించింది. పుతిన్ ఎప్పుడు భారత్ లో పర్యటిస్తారనే దానిపై చాలా రోజులుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పుడు రష్యాతో చర్చల గురించి అధికారిక ప్రకటన వెలువడింది. రష్యా రాయబార కార్యాలయాన్ని ఉటంకిస్తూ పుతిన్ పర్యటన, ద్వైపాక్షిక చర్చల గురించి వార్తా సంస్థ సమాచారం ఇచ్చింది.
దీని ప్రకారం డిసెంబర్ 6న పుతిన్ న్యూఢిల్లీ చేరుకోనున్నారు. ఆయనతో పాటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, రక్షణ మంత్రి సెర్గీ షోగుయ్ భారత్కు వస్తున్నారు. అదే రోజు లావ్ రోవ్, షోగుయ్ ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అవుతారు. సాయంత్రం ప్రధాని మోడీతో పుతిన్ భేటీ కానున్నారు. భారత్ తో జరిపే ఈ ద్వైపాక్షిక చర్చలు చాలా ముఖ్యమైనవని రష్యన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయని స్పష్టం చేసింది. హిందూ మహాసముద్రం, ఆఫ్ఘనిస్థాన్, సిరియా వంటి ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. చాలా విషయాల్లో భారత దేశం, రష్యా మధ్య ఒప్పందం, సహకారం ఉంది. ఐతే చైనా విషయంలో రెండు దేశాల మధ్య మరిన్ని చర్చలు అవసరమనే అబిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రత్యేక మిత్ర దేశాలతో ద్వైపాక్షిక చర్చల సంప్రదాయాన్ని ప్రారంభించింది భారత్. రష్యాతో పాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతోంది.
Russian President Vladimir Putin will visit India on Dec 6, 2021. During the negotiations with PM Narendra Modi, it is planned to discuss further development of relations of the special and privileged strategic partnership between the two countries: Russian Embassy pic.twitter.com/0hO2FcY12L
— ANI (@ANI) November 26, 2021