రఘురామకు పూర్తైన వైద్య పరీక్షలు
సీల్డ్ కవర్ లో వైద్య పరీక్షల ఫలితాలు
ఈనెల 21న సుప్రీం కోర్టుకు నివేధిక
సికింద్రాబాద్- సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నర్సాపురం ఎంపీ రఘురామక్ళష్ణరాజుకు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సోమవారం రాత్రి ఆయనను గుంటూరు నుంచి సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం నుంచి రఘురామ కృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్మీ ఆస్పత్రిలోని వీఐపీ రూంలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. రఘురామ కృష్ణరాజుకు ముగ్గురు డాక్యర్ల మెడికల్ బోర్డ్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు నియమించిన న్యాయాధికారి నాగార్జున సమక్షంలో ఈ వైద్య పరీక్షలు జరిగాయి. ఆర్మీ ఆస్పత్రి అధికారులు హైకోర్టు రిజిస్టార్ ద్వారా ఈ నెల 21న సుప్రీంకోర్టుకు వైద్య పరీక్షల నివేధికను సీల్డ్ కవర్లో అందజేయనున్నారు. సుప్రీం కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు రఘురామ కృష్ణరాజు ఆర్మీ ఆస్పత్రిలోనే ఉండనున్నారు.
ఇక ఇప్పడు ఆర్మీ వైద్యులు నిర్వహించిన పరీక్షల ఫలితాలకు సంబందించి నివేదిక అందరిలో ఆసక్తిరేపుతోంది. రఘురామ కృష్ణరాజుకు అందిస్తున్న వైద్యం, చేస్తున్న పరీక్షలపై సమాచారం బయటకు రాకుండా ఆర్మీ ఆస్పత్రి వర్గాలు జాగ్రత్తపడుతున్నాయి. ప్రస్తుతం రఘురామ కృష్ణరాజు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, సుప్రీం కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరక ఆయన ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటారని స్పష్టం చేశారు. మంగళవారం వైద్య పరీక్షలు జరుగుతున్న సమయంలో రఘురామకృష్ణరాజును కలిసేందుకు ఆయన కుమారుడు భరత్ అక్కడకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున ఎవరూ కలవడానికి వీలు లేదని ఆర్మీ అధికారులు నిరాకరించడంతో నిరాశతో భరత్ వెళ్లిపోయారు. మొత్తానికి సీఐడీ పోలీసులు తనను కొట్టారంటున్న రఘురామ కృష్ణ రాజు ఆరోపణల్లో నిజమేంత అన్నది ఆర్మీ వైద్యుల పరీక్షల్లో తేలనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.