ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోందా? ఇంతలా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందా? ఆర్థిక అత్య వసర పరిస్థితి విధించాల్సిన పరిస్థితి వచ్చిందా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోన్న చర్చ. ఆర్టికల్ 360ని ప్రయోగించి రక్షించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. గతంలో యనమల రామకృష్ణుడు కూడా ఇలాంటి వాఖ్యలు చేయడం విశేషం. కొత్తగా చేసే అప్పుల్లో 42% పాత అప్పులు, వడ్డీలు చెల్లించడానికే సరిపోతున్నా యని, దీనివల్ల నెలలో సగం గడిచిన తర్వాతా ఉద్యోగులకు జీతాలు, పింఛన్లను చెల్లించలేని పరిస్థితి నెలకొందని పేర్కొంటూ ఆయన ఇటీవలే రాష్ట్రపతికి రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.
రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లపాలన లో తెలుగుదేశం ప్రభుత్వం రూ.1.65 లక్షల కోట్లు అప్పు చేస్తే, రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.1.15 లక్షల కోట్లు అప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు జీఎస్డీపీలో 41.46%కి మించి పోయాయని రఘురామకృష్ణరాజు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిమితులకు మించి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా బడ్జెటేతర మార్గాల్లో అప్పులు తీసుకుంటోందని పేర్కొన్నారు. వచ్చే 20-30 ఏళ్ల వరకు వచ్చే మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి ఎస్బీఐ కన్సార్షియం ద్వారా అప్పుల సేకరణకు నిర్ణయించడం ఇందుకు ప్రబల ఉదాహరణ అని వివరించారు.
నిబంధనల ప్రకారం అందులో 4 శాతం వరకూ అప్పులు చేసుకునే వీలుంటుంది. అంటే ఏపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 42,472 కోట్ల వరకూ అప్పులు తెచ్చుకునే వీలుంది. అందులో మూలధనం కింద రూ. 27,589 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రప్రభుత్వం తన కున్న పరిమితికి మించి 2020-21లో అదనంగా అప్పులు చేయడంతో రూ. 17,923.94 కోట్ల మేర కేంద్రం కోత వేస్తూ ఏపీ ప్రభుత్వానికి తెలియజేసింది. అంతేగాకుండా మిగతా రుణాల్లో కూడా మరో రూ. 6 వేల కోట్లు కోతపడింది. మొత్తంగా రూ. 23 వేల కోట్ల మేరకు కోత విధించారు.
దీంతో ఏపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేయడానికి అవకాశం ఉన్న అప్పుల పరిమితి రూ. 27688 కోట్లు మాత్రమేనని కేంద్రం తేల్చింది. ఆదాయ పరిమితి మేరకు వ్యయం చేయాల్సి ఉంటే, దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని గత ప్రభుత్వం మీద విమర్శలు వచ్చాయి. జగన్ ప్రభుత్వం తీరు మీద అంతకు మించిన మోతాదులో ఆరోపణలున్నాయి. ప్రస్తుతం వ్యవస్థ కుప్పకూలే దశలో ఉన్నందున రాజ్యాంగ ధర్మకర్తగా జోక్యం చేసుకుని సంక్షోభ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే రాష్ట్రపతికి ఫిర్యాదులు అందాయి అని సమాచారం.
మరిన్ని వివరాలకి ఈ వీడియో చూడండి: