ఏపీ జగన్ సర్కార్ వారికి శుభవార్త తెలిపింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి జిల్లాలో నేడు పర్యటించనున్నారు. వెంకటగిరిలో బటన్ నొక్కి వారి ఖాతాలోకి నిధులను విడుదల చేయనున్నారు.
చేనేత కార్మికులు స్థానికంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా చాలా ప్రఖ్యాతిగాంచారు. అటువంటి నేతన్నలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. నాడు నేతన్నల జీవితాలు ఆర్థికంగా చితికిపోతుండేవి. కానీ ఏపీలో జగన్ సీఎం పదవి చేపట్టిన తర్వాత. నేతన్నల తలరాతను మార్చే పథకం తీసుకువచ్చారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపారు. నేతన్నలకు జగన్ ప్రభుత్వం ఈ పథకం ద్వారా గత నాలుగు సంవత్సరాలుగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
నేడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వెంకటగిరిలో బటన్ నొక్కి.. ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఖాతాలోకి నిధులు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు రూ. 193.64 కోట్లను లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయనున్నారు. అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ.24 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో నేడు సీఎం జగన్ బటన్ నొక్కి ఈ లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్న నేస్తం ద్వారా రూ. 967.77 కోట్లు అందించింది.
ఇదిగాక.. నేతన్నలకు పెన్షన్ కొరకు రూ. 1.396 కోట్లు, ఆప్కోకు మరో రూ. 468.84 కోట్లు అందించింది. మొత్తం ఇప్పటివరకు ఈ మూడింటి ద్వారా రూ. 2,835.06 కోట్లు జగన్న ప్రభుత్వం అందించింది. ఇప్పటివరకు ప్రతి నేతన్నకు ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించిన మొత్తం రూ. 1,20,000. దీంతో చేనేత కార్మికులు వారి మగ్గాలను ఆధునిక పరికరాలతో జోడించి కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను తయారు చేస్తున్నారు. దీంతో నేతన్నల జీవితాల్లో గణనీయంగా మార్పు వచ్చింది. వారు ఆర్థికంగా నిలబడేందుకు భరోసా ఇస్తుంది జగన్ సర్కార్.