ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార, విపక్షాలు సవాలు, ప్రతి సవాలుతో ఎన్నికలను కదన రంగంగా మార్చాయి. దేశ రాజకీయాల కన్నా ఆసక్తికర పరిణామం ఒకటి ఏపీలో చోటు చేసుకుంటుంది. అధికార వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన సవాలు రాష్ట్ర రాజకీయంలో ఆసక్తికర పరిణామాలకు తెర తీసింది. రెబల్ ఎంపీగా.. సీఎం జగన్ కి కొరకరాని కొయ్యగా ఉన్న రఘురామ కృష్ణరాజు.. త్వరలోనే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 5 లోపు తనపై అనర్హత వేటు వేసేందుకు వైసీపీకి చాన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. లేదంటే తానే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తానని వెల్లడించారు. గతంలో కంటే ఈ సారి భారీ మెజారిటీతో గెలుస్తానని రఘురామ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే రఘురామ కృష్ణరాజు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికలకు వెళ్తే పరిస్థితి ఏంటి.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వంటి తదితర వివరాలు..
జగన్ చరిష్మా గెలిపిస్తుందా..
ఏపీలో ఇప్పటి వరకు ఏ ఎన్నికలు జరిగినా.. అధికార పార్టీనే విజయం వరిస్తూ వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం సీఎం జగన్ తీసుకువచ్చిన ప్రజాకర్షక పథకాలు అనడంలో ఏ సందేహం లేదు. అధికారంలో ఉండటం కూడా వైసీపీ బాగా కలసి వచ్చే అంశం. అయితే రఘురామా రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తే.. మిగతా ఎన్నికల్లో రిపీటైన ఫలితాలే వస్తాయా అంటే అంత ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ రఘురామా తనను ఎంపీగా గెలిపించిన పార్టీకే వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడ ఆయన స్థానికత, లోకల్ క్యాడర్ వంటి అంశాలు రఘురామకు కలసి వస్తాయి.
విపక్షాల మద్దతు రఘురామకే..
సొంత పార్టీకి యాంటీగా ఉంటున్న రఘురామ అంటే విపక్షాలకు కూడా అభిమానమే. ఇలాంటి పరిస్థితుల్లో.. ఒకవేళ నరసాపురం నియోజకవర్గంలో నిజంగానే ఉప ఎన్నిక గనక వస్తే.. విపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్ష పార్టీలు అన్ని రఘురామాకే మద్దతు ఇస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. విపక్షాలన్ని ఏకమైతే.. రఘురామా గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఆ రెండు సామాజిక వర్గాలే ప్రధానం
నరసాపురం నియోజకవర్గంలో కాపులు, రాజులు రెండు సామాజిక వర్గాలే ప్రధానం. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి గెలుపును నిర్ణయించేది వీరే. ఇక రఘురామ స్వయంగా రాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ వర్గం మద్దతు ఆయనకు పూర్తిగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక వైసీపీ ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో నిలుపుతుంది అనే దాని మీద ఎన్నికల ఫలితం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నరసాపురంలో రాజులదే ఆధిపత్యం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయం తేటతెల్లమయ్యింది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో.. వైసీపీ తరఫున రాజు సామాజిక వర్గానికి చెందిన రఘురామా కృష్ణరాజుపై.. టీడీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాక.. అదే సామాజిక వర్గానికి చెందిన వేటూకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ) బరిలో నిలిపింది. ఈ ఎన్నికల్లో రఘురామ కృష్ణరాజు.. 31,909 ఓట్ల తేడాతో 38.11% ఓట్లు సాధించి శివ రామరాజుపై విజయం సాధించారు. కనుక ఇక్కడ అధికార వైసీపీ కూడా రాజు సామాజిక వర్గానికే ప్రధాన్యత ఇవ్వాలి. కానీ రఘురామాను ఎదుర్కొనే అభ్యర్థి లభించడం అనేది అంత తేలికైన అంశం కాదు.
వైసీపీని కాపులు కాపాడతారా..?
రఘురామ కృష్ణరాజు రాజీనామాతో నర్సాపురం లోక్ సభ నియోజక వర్గంలో ఉప ఎన్నిక వస్తే.. కాపులకు అవకాశం ఇవ్వాలనేది వైసీపీ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే రఘురామాపై బరిలో నిలిపేందుకు కాపు నియోజకవర్గం నుంచి ఒక అభ్యర్ధిని కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన వైసీపీ నేత కారు. ఆ పార్టీకి సంబంధం లేని తటస్థ వ్యక్తి. పైగా ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన పేరు ఎంవీజీకే భాను. ఆయన 2018లో పదవీ విరమణ చేశారు. ఇక 2019 అసోం ఎన్నికల్లో తేజ్ పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అసోంలో అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
గోదావరి జిల్లాలో బలమైన సామాజికవర్గానికి చెందిన భాను నర్సాపురంలో పక్కా లోకల్. కనుక ఆయనను బరిలో నిలిపి.. రాఘురామ ఆట కట్టించాలని వైసీపీ వ్యూహ రచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక భానుకు కూడా రాజకీయాలంటే ఆసక్తే కాక.. నర్సాపురంలో ఆయన సామాజికవర్గం కూడా గట్టిగా ఉండడంతో ప్లస్ అయ్యే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. మరి ఎవరి అంచనాలు ఫలిస్తాయో.. ఎవరి వ్యూహాలు గెలుపు తీరాలను చేర్చుతాయో త్వరలోనే తెలుస్తోంది. మొత్తానికి నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత భారీ ఖర్చుతో కూడిన ఎన్నికే కాక.. అత్యంత ఆసక్తిదాయక పోరుగా నిలవనుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.