న్యూ ఢిల్లీ- భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు కూనూర్ సమీపంలో సైనిక హెలికాఫ్టర్ ప్రమాదంలో అసువులు బాసిన బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13 మందికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో మోదీ అమరజవాన్ల భౌతికకాయాల వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడే ఉన్న అమరజవాన్ల కుటుంబసభ్యులను ప్రధాన మంత్రి పరామర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సైన్యాధికారులు సైతం అమరజవాన్లకు నివాళులర్పించారు.
శుక్రవారం ఉదయం 11 గంచల నుంచి 12:30 గంటల మధ్య ప్రజల సందర్శనార్థం బిపిన్ రావత్ భౌతికకాయన్ని అందుబాటులో ఉంచుతారు. సాయంత్రం 4 గంటలకు రావత్ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులిక అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రావత్ అంతిమ యాత్రలోను ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారని తెలుస్తోంది.