దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంక్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామాన్ తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోస్టాఫీసులను బ్యాంకింగ్ రంగంలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షన్నర పోస్టాఫీసుల్లో ఇకపై బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అంటే నగదు జమ చేయడం, విత్ డ్రా, ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు ఏటీఏం సేవలు కూడా అందిస్తాయని తెలిపారు.
ఇప్పటికే పోస్టల్ శాఖ ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకు(ఐపీపీబీ) పేరుతో పలు రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. అయితే నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పేర్కొన్న ప్రకారం ఇకపై అన్ని పోస్టాఫీసులు బ్యాంకింగ్ సేవలు అందిచనున్నాయి. ప్రైవేట్ బ్యాంకులతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ పద్ధతిని అమలు చేస్తున్నాయి. అకౌంట్లో కనీస బ్యాలెన్స్ ఉంచకపోతే బ్యాంకులు జరిమానాలు విధిస్తుంటాయి. అయితే పోస్టల్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్తోనూ అకౌంట్ తెరుచుకునే సౌలభ్యం ఉంది.