బ్యాంకులు రుణం తీసుకున్న వ్యక్తులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు కనుక రుణగ్రహీతల విషయంలో అలా చేస్తే కనుక ఖచ్చితంగా జరిమానా లేదా పరిహారం చెల్లించాలనే విషయంపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
చాలా మంది రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తారు. అయితే ఈఎంఐ సరిగా చెల్లించకపోయినా, చెక్ బౌన్స్ అయినా, రుణం తిరిగి చెల్లించకపోయినా, యావరేజ్ మంత్లీ బ్యాలన్స్ మెయింటెయిన్ చేయకపోయినా బ్యాంకులు ఖాతాదారులపై జరిమానా విధిస్తుంటాయి. కానీ మీకు తెలుసా, బ్యాంకులు కూడా తప్పు చేస్తాయని. తప్పు చేస్తే ఖాతాదారులకు నష్టపరిహారం భారీగా చెల్లించుకోవాల్సిందే. బ్యాంకులు తప్పు చేయడం ఏంటని అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. అన్ని బ్యాంకులు పనిగట్టుకుని తప్పులు చేయకపోవచ్చు. కానీ పొరపాటున ఖాతాదారుల విషయంలో తప్పు జరిగితే మాత్రం.. పరిహారం చెల్లించాల్సిందే. ఈ విషయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.
ఒక వ్యక్తి రుణం తీసుకునే సమయంలో బ్యాంకులు ఆ వ్యక్తి నుంచి కొన్ని డాక్యుమెంట్స్ ని తీసుకుంటుంది. అవి ఇంటి పత్రాలు కావచ్చు, ల్యాండ్ పత్రాలు కావచ్చు, మరేవైనా ఇతర పత్రాలు కావచ్చు. రుణం పూర్తిగా చెల్లించే వరకూ బ్యాంకులు పత్రాలను తమ దగ్గరే పెట్టుకుంటాయి. ఈ పత్రాలు ఖాతాదారులకు చాలా ముఖ్యం. ఇంటి డాక్యుమెంట్స్ అయితే చాలా చాలా ముఖ్యం. పొరపాటున గానీ లేదా వేరే ఇతర కారణాల వల్ల గానీ ఈ పత్రాలను బ్యాంకు పోగొట్టినట్లైతే ఖాతాదారులకు పరిస్థితి ఏంటి? అనే దానిపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఆర్బీఐ ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ఆమోదించాలని భావిస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మాజీ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో ఈ విషయానికి సంబంధించిన నివేదికను రిజర్వ్ బ్యాంకుకి అందించారు. రుణగ్రహీతలు ఎవరైనా తమ ఆస్తుల పత్రాలు పెట్టి లోన్ తీసుకుని.. రుణం చెల్లించిన తర్వాత ఆ పత్రాలను బ్యాంకు తిరిగి ఇవ్వలేకపోతే వారికి జరిమానా లేదా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. రుణగ్రహీతలు ఖాతా మూసివేయబడితే.. అతని పత్రాలను సురక్షితంగా వెనక్కి ఇవ్వడానికి బ్యాంక్ తేదీని నిర్ణయించాల్సి ఉంటుందని బీపీ కనుంగో ప్యానెల్ తన సిఫార్సుల్లో సూచించింది. రుణగ్రహీతల పత్రాలను తిరిగి ఇవ్వడంలో జాప్యం జరిగితే జరిమానా లేదా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కమిటీ సిఫార్సుపై వాటాదారుల అభిప్రాయాలను కోరింది.