కట్టెలు కొట్టుకునే వ్యక్తి గొడ్డలి నదిలో పడిపోతే గంగమ్మ తల్లి బంగారు గొడ్డలి తెచ్చి ఇచ్చినట్టు మనం చిన్నప్పుడు విన్నాం. నిజ జీవితంలో ఇలాంటి కథలు నిజం కావని అనుకుంటారు. కానీ అదృష్టం ఉంటే కొందరికి కథలూ నిజమవుతాయి, కలలూ నిజమవుతాయి. దీనికి నిదర్శనమే మధ్యప్రదేశ్కు చెందిన గిరిజన మహిళ. అడవి తల్లినే నమ్ముకుని జీవనం సాగించే ఆ మహిళను ఆ అడవి తల్లి రూపంలో అదృష్టం వరించింది. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో ఓ గిరిజన మహిళ కట్టెల కోసం వెళ్తే అడవి తల్లి ఏకంగా వజ్రాన్నే వరమిచ్చింది.
గిరిజన ప్రాంతాల్లో నివసించే గిరిజనులు కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుంటారన్న విషయం తెలిసిందే. దీని కోసం రోజూ అడవికి వెళ్ళి కట్టెలు పోగుజేసి నెత్తిన పెట్టుకుని ఇంటికి తెచ్చుకుంటారు. వీరిలో జాక్పాట్ కొట్టిన ఈ మహిళ కూడా ఉన్నారు. పురుషోత్తంపూర్కు చెందిన గోందాబయి కట్టెల కోసం రోజూ అడవికి వెళ్తుంది. కట్టెల కోసం అడవికి వెళ్ళగా అక్కడ వజ్రం ఆమె కంట పడింది. సంతోషంతో భర్తకు విషయం చెప్పింది. భర్తతో కలిసి డైమండ్ కార్యాలయానికి వెళ్ళగా.. అనుపమ్ సింగ్ అనే డైమండ్ ఇన్స్పెక్టర్ దాన్ని పరిశీలించారు. ఆ వజ్రం 4.39 క్యారెట్లు ఉందని, దాని విలువ 20 లక్షలు ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పన్నులు, రాయితీలు మినహాయించగా మిగిలిన డబ్బును ఆ మహిళకు అందజేస్తామని ఆయన తెలిపారు. ఇక ఈమెకు వజ్రం దొరకడంపై మిగిలిన గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ గిరిజన మహిళకు అడవి తల్లి అదృష్టాన్ని ప్రసాదించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.