భారత దేశంలో వైవాహిక బంధానికి ఎంతో విలువ ఇస్తారు. వేద మంత్రాల మద్య, బంధు మిత్రులు నిండూ నూరేళ్లు నూతన వధూవరులు కలిసి జీవించాలని ఆశీర్వదిస్తారు. భారతీయ సమాజంలో తమ భర్తలను దేవుళ్లుగా భావించే మహిళలు చాలా మంది ఉన్నారు. కానీ సాక్షాత్తు ఆ భగవంతుడినే భర్తగా భావించడం.. పెళ్లి చేసుకోవాలని కలలు కనడం ఇటీవల ఓ ట్రెండ్ గా మారింది. జైపూర్కు చెందిన 30 ఏళ్ల యువతి శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని ప్రారంభించింది. వింటానికి కాస్త విడ్డూరంగా ఉన్నా.. తన జీవితం శ్రీ కృష్ణడికి అంకితం ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది యువతి. వివరాల్లోకి వెళితే…
రాజస్థాన్లోని జైపూర్కు చెందిన పూజా సింగ్ అనే యువతి డిసెంబర్ 8న వివాహం చేసుకుంది. ఈ వేడుకకు బంధుమిత్రులు 300 మంది వరకు విచ్చేశారు. శ్రీకృష్ణుడితో వివాహం జరిగిన విషయం చుట్టు పక్కల గ్రామాలే కాదు.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై పూజా సింగ్ మాట్లాడుతూ.. ‘గతంలో తనకు ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి.. కానీ నేను వాటన్నింటిని తిరస్కరించాను. ఇటీవల ఓ పూజారి ద్వారా తులసి వివాహం గురించి పూర్తిగా తెలుసుకున్నా.. అప్పటి నుంచి నాకు కన్నయ్య పై ప్రేమ కలిగింది.. ఆయన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మొదట నా పెళ్లికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వ్యతిరేకం తెలిపినా.. నేను హిందూ మతాచారాల ప్రకారం తులసీ శాలిగ్రామ వివాహపద్దతిలో శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకున్నా’ అని తెలిపింది.
‘ఇలాంటి వివాహాలు కొత్తేమీ కాదు.. విష్ణువుతో వివాహం శాస్త్రోక్తమైనది. ఈ వివాహం తులసి కళ్యాణం లాంటిది. పూర్వ కాలంలో ఇలాంటి వివాహాలు జరిగేవి విన్నాను. అంతేకాదు కర్మత్గురు పుస్తకంలో పేజి నెంబర్ 75లో తెలిపినట్లు శ్రీమహా విష్ణువుతో అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చని పూజారులు అన్నారు. ఈ వివాహం గురించి నేను రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఈ వివాహానికి నా తండ్రి హాజరు కాలేదు.. అన్నీ అమ్మే దగ్గరుండి చూసింది. వివాహం అనేది ప్రతి యువతికి మధురానుభూతి.. దేవుడినే నా భర్తగా పొందినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను.. నా జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందని పూజారి అన్నారు’ అని తెలిపింది. శ్రీకృష్ణ భగవాన్ ని పెళ్లి చేసుకున్న పూజా సింగ్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.