ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పదవీకాలం ముగిసినందున సోమవారం రాజ్యసభలో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. పదవీ కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న వెంకయ్యనాయుడికి అభినందనలు తెలియజేశారు. ఇది ఉద్వేగభరితమైన క్షణమని అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి బీజేపీ అధ్యక్షుడు సహా అనేక పదవులు చేపట్టారని, యువ ఎంపీలను సైతం ప్రోత్సహించారని అన్నారు. వెంకయ్య నాయుడు కొత్త తరంతో మమేకమయ్యారని, భావితరాలకు వెంకయ్య నాయుడు ఆదర్శమని అన్నారు.
ఇక ఆయన వాక్చాతుర్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదని, అది అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు. ఆయన మాటల్లో వ్యంగ్యం, గంభీరత ఉంటుందని పేర్కొన్నారు. ఛైర్మన్ హోదాలో విజయవంతంగా రాజ్యసభను నడిపించారని, సభ యొక్క గౌరవ, మర్యాదలను మరింత పెంచారని గుర్తుచేశారు. రాజ్యసభ సచివాలయంలో ఎన్నో మార్పులు తెచ్చారని, అనేక బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారని అన్నారు. వెంకయ్య నాయుడి నిబద్ధత స్పూర్తిదాయకమని, అందరూ ఆయనను చూసి ఎంతో నేర్చుకోవాలని అన్నారు. మరి వెంకయ్యనాయుడిపై మోదీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.