దేవుడి తర్వాత చేతులెత్తి మొక్కెదీ వైద్యులకే. వైద్యుడు ప్రాణం పోస్తాడు కానీ.. తీయడు. అంతటి మహోన్నత వృత్తిలో ఉన్న ఓ వైద్యుడు.. ఆ వృత్తికే కళంకం తెచ్చాడు. అభం శుభం తెలియని ఓ మహిళను మోసం చేసి.. ఆమె కిడ్నీలు దొంగిలించాడు. కిడ్నీలు పోవడంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో తనకు పనికి రావంటూ భర్త వదిలేశాడు. నువ్వు చచ్చినా బతికినా నాకు సంబంధం లేదంటూ ముగ్గురు పిల్లలను ఆమె వద్దే వదిలేశాడు. ఇప్పుడు ఆమె ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద గాధ బీహార్లోని ముజఫర్ పూర్లో చోటుచేసుకుంది.
సునీత, అక్లు రామ్ భార్యా భర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. భర్త సరిగ్గా పట్టించుకోకపోవడంతో సునీత రోజువారీ కూలీగా వెళ్లేది. గత ఏడాది ఆమె గర్భాశయ ఇన్ ఫెక్షన్ తో ముజఫర్ పూర్ లోని ఓ క్లినిక్ లో చేరింది. అయితే ఆ ఆసుప్రతిలో ఓ వైద్యుడు ఆమె కిడ్నీలు తొలగించి.. పారిపోయాడు. దీంతో ఆమె పరిస్థితి విషమించింది. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆ ఆసుప్రతి యాజమాన్యం పాట్నాలోని మరో ఆసుపత్రిలో ఆమెను చేర్చి చేయి దులుపుకుంది. అక్కడ అసలు విషయం తెలిసింది. అప్పటి నుండి ఆమెకు ప్రతి రెండు రోజులకొకసారి డయాలసిస్ చేయాల్సి వస్తుంది. పలువురు ఈమె కథ విని కిడ్నీలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినప్పటికీ.. అవి సరిపోలేదు.
కొన్ని రోజుల క్రితం సునీత భర్త అక్లు రామ్ కూడా తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు రాగా, అది కూడా సరిపోలేదు. ఈ విషయంపై భార్యాభర్తలపై గొడవలు మొదలయ్యాయి. దీంతో సునీతను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. వెళ్లిపోయే సమయంలో ‘నువ్వు ఎందుకూ పనికిరావు, నీతో కలిసి జీవించడం కష్టం. ఇక నీవు బతికినా, చచ్చినా పట్టించుకోను‘ అని చెప్పి తన ముగ్గురు పిల్లలను ఆమె దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఎస్ కె మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో తాను చనిపోతే.. తన బిడ్దల పరిస్థితి ఏంటనీ, వాళ్లేమీ తప్పు చేశారంటూ కన్నీరు మున్నీరవుతుంది. వైద్యులు, భర్త మోసం చేసినా బిడ్డల కోసం తాను బతకాలని సునీత పరితపిస్తుంది. ఈ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.