ప్రస్తుతం ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజల సామాజిక, వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. వారిలో అలసత్వమూ పెరిగిపోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది కరోనా మొదటి ఉద్ధృతిలో ప్రయాణాలు, పండుగల సమయంలో గుమిగూడటాలు ఎక్కువయ్యాయి. ఫలితంగా ఈ ఏడాది మార్చిలో రెండో ఉద్ధృతి మొదలైంది. రెండో ఉద్ధృతి వల్ల దేశ ప్రజల్లో సహజసిద్ధ రోగ నిరోధక శక్తి భారీగా పెరిగింది. ఇది మూడో విజృంభణ ప్రభావాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు. భారత వైద్య పరిశోధన మండలి గత నెలలో నిర్వహించిన జాతీయస్థాయి యాంటీబాడీ సర్వేలో ఆరేళ్లు పైబడ్డ మూడింట రెండొంతుల మంది భారతీయులు కరోనా వైరస్కు గురైనట్లు తేలింది.
రెండో ఉద్ధృతి మొదలై ఇప్పటికి 5 నెలలు గడిచాయి. ఇప్పుడు దేశంలో రోజువారీ కేసుల సంఖ్య దాదాపు 40వేల వద్ద ఉంటోంది. గత కొద్దిరోజులుగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు సగం కేరళలోనే వెలుగు చూస్తున్నాయి. ఆ రాష్ట్రం తదుపరి హాట్స్పాట్గా మారొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ఇతర రాష్ట్రాల్లోనూ స్వల్పకాలం పాటు కేసులు పెరిగాయని నిపుణులు తెలిపారు. కొన్ని పెద్ద రాష్ట్రాల్లో ఇన్ఫెక్షన్లు పెరిగితే.. దేశవ్యాప్త కేసుల సంఖ్య మరోసారి పెరుగుతుందని హెచ్చరించారు. వ్యాక్సినేషన్ పెరిగేవరకూ ఇలాంటి పరిస్థితి ఉంటుందన్నారు. దేశ జనాభాలో 7.6%మంది మాత్రమే పూర్తిస్థాయిలో టీకాలు పొందారని గణాంకాలు చెబుతున్నాయి.
కరోనా ఉద్ధృతులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నగరాల్లో వైరస్ క్లస్టర్లను గుర్తించ డానికి గాలి, మురుగునీటి నమూనాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ప్రజారోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ఆసుపత్రుల్లో బాధితుల తాకిడి పెరగడానికి ముందే ఇన్ఫెక్షన్లను పట్టుకోవచ్చని చెప్పారు. భారత్లో ఈ నెలలోనే మరోసారి కొవిడ్-19 ఉద్ధృతి మొదలు కానుందని పరిశోధకులు పేర్కొన్నారు. అది క్రమంగా పెరుగుతూ అక్టోబరులో గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని విశ్లేషించారు.
నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడుతూ ఇప్పటివరకు యాంటీబాడీలు కనిపించని 40 కోట్ల మంది కోవిడ్ ద్వారా కాకుండా టీకా తీసుకోవడం వల్ల వాటిని తెచ్చుకోవాలని సూచించారు. ఇప్పటికీ ప్రతి ముగ్గురిలో ఒకరు కొవిడ్-19కు గురవడానికి అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.