పేరుతో సంబంధం లేకుండా కేవలం తమ వృత్తి కారణంగా దేశం మొత్తం గర్వించతగ్గే వ్యక్తులు ఇద్దరున్నారు. వారిలో ఒకరు అన్నం పెట్టే కిసాన్ కాగా, మరొకరు ప్రాణం నిలబెట్టే జవాన్. ఈ ఇద్దరూ దేశానికి రెండు కళ్ళు. కిసాన్ అయినా, జవాన్ అయినా తమ వృత్తికి(దేశానికి) ద్రోహం చేయరన్న నమ్మకం ఉంది మనందరిలో. కానీ ఒక జవాన్ మాత్రం ఆ నమ్మకాన్ని పోగొట్టాడు. ఆడవాళ్ళ మోజులో పడి భారత సైనిక రహస్యాలను లీక్ చేశాడో ఆర్మీ ఉద్యోగి. పాకిస్థాన్కు చెందిన ఇద్దరు లేడీ ఏజెంట్లు వేసిన హనీ ట్రాప్లో భారతదేశానికి చెందిన జవాన్ ఒకరు ఇరుక్కున్నారు. సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఆ లేడీ ఏజెంట్లకు షేర్ చేయడంతో జవాన్ను ఇంటిలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్లోని బగుండా జిల్లా కంచన్పూర్ గ్రామానికి చెందిన శాంతిమోయ్ రాణా(24), జైపూర్లోని భారత ఆర్మీలోని ఆర్టిల్లెరీ యూనిట్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. 2018లో ఆర్మీలో చేరిన శాంతిమోయ్ రాణాకి.. పాకిస్థాన్ ఏజెంట్లు అయిన గుర్నౌర్ కౌర్ అలియాస్ అంకిత, నిషా వాట్సాప్ ద్వారా పరిచయం అయ్యారు. సోషల్ మీడియా ద్వారా అతని వివరాలు, ప్రొఫైల్ చెక్ చేసిన ఆ ఏజెంట్లు తమను తాము ఫేక్ ప్రొఫెషన్తో పరిచయం చేసుకున్నారు. ఒకరు ఇండియన్ మిలటరీ ఇంజనీరింగ్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని, మరొకరు మిలటరీలోని నర్సింగ్ విభాగంలో పనిచేస్తానని నమ్మించారు. నెమ్మదిగా రాణా ఫోన్ నంబర్ తెలుసుకుని.. అతన్ని తమ మాయ మాటలతో బుట్టలో వేసుకున్నారు.
తమని పూర్తిగా నమ్మాడని నిర్థారించుకున్న తర్వాత ఆ ఏజెంట్లిద్దరూ జవాన్ నుంచి సైనిక రహస్యాలు తెలుసుకోవడం మొదలుపెట్టారు. వారి మాయలో పడిన రాణా.. తన రెజిమెంట్కు సంబంధించిన రహస్య సమాచారాలతో పాటు, సైనికులు వ్యాయామాలు చేస్తున్న వీడియోలు కూడా వాళ్లకి పంపాడు. దీని కోసం ఏజెంట్లు రాణాకి డబ్బు ఆశ చూపించినట్లు రాజస్థాన్ ఇంటిలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమేష్ మిశ్రా మీడియాకు వెల్లడించారు. గత కొంతకాలంగా రాణా కదలికలపై నిఘా ఉంచామని, సైనిక రహస్యాలు బహిర్గతం చేశాడని రుజువు కావడంతో ఈ నెల 25న రాణాను అరెస్ట్ చేశామని, ప్రస్తుతం అతను తమ అదుపులో ఉన్నట్లు ఆయన వివరించారు. భారత సైనికులకు సంబంధించిన రహస్యాలను పాకిస్థాన్ ఏజెంట్లకు లీక్ చేసిన ఈ జవాన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.