దాయాది దేశం పాకిస్తాన్ పేరు చెప్పగానే మనలో చాలామందికి శత్రువు అనే ఫీలింగ్ కలుగుతుంది. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంది. మన దేశానికి నష్టం కలిగించేందుకు పాక్ ఉగ్రవాదులకు అడ్డగా మారుతోంది. ఇక సరిహద్దుల్లో పాక్ చేసే దురాగతాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య నిత్యం తీవ్ర ఉద్రిక్త వాతావారణం నెలకొని ఉంటుంది. రాజకీయాలు, దౌత్య పరంగా ఇలాంటి సంఘటనలు ఓకే. కానీ ఆటల విషయంలో కూడా ఇదే తీరు కనిపిస్తుంది. భారత్-పాక్ మధ్య మ్యాచ్కు ఎంతటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇరు దేశాల ప్రజలు.. తామే స్వయంగా మైదానంలో దిగి ప్రత్యర్థితో తలపడుతున్నట్లు భావిస్తారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరి ఇరు దేశాల్లోని సామాన్యుల పరిస్థితి ఏంటి. వారికి ఈ వైరాలు ఏం పట్టవు. రోజు ఎలా గడుస్తుందనేదే వారికి ప్రధానం. వైరాలు, పగలు-ప్రతీకారాలు వారికి పట్టవు. ఇదిగో ఈ విషయాన్ని రుజువు చేసే సంఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది.
సాధారణంగా పెళ్లి అనగానే పక్క ఊరు, మండలం, జిల్లా, ఆకరికి వేరే రాష్ట్రాలకు చెందిన వారితో కూడా అవుతుంటాయి. ఇక ఈ మధ్య కాలంలో విదేశాలకు చెందిన వారిని కూడా వివాహం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే పెళ్లి కూడా ఈ కోవకు చెందినదే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ పెళ్లి భారత్, పాక్ దేశాలకు చెందిన వ్యక్తుల మధ్య జరుగుతోంది. అది కూడా ప్రేమ వివాహం. ప్రస్తుతం ఈ పెళ్లి గురించి దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. జలంధర్కు చెందిన యువకుడు.. పాకిస్తాన్కు చెందిన మహిళను వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యాడు. ఆ వివరాలు..
పాకిస్తాన్కు చెందిన శ్యామల, పంజాబ్లోని జలంధర్కి చెందిన కమల్ కల్యాణ్ భరత్ అనే వ్యక్తి కుటుంబాల మధ్య బంధుత్వం ఉంది. చుట్టాల పెళ్లిలో మొదటిసారి శ్యామలను చూసిన భరత్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు తొలిచూపులోనే ఆమెపై మనసు పారేసుకున్నాడు. పెళ్లంటూ చేసుకుంటే శ్యామలే తన సహ ధర్మచారిణి కావాలని నిర్ణయించుకున్నాడు. బంధువుల అమ్మాయి కావటంతో భరత్ మొదట స్నేహమంటూ ఆమెతో మాటలు కలిపాడు. ఇద్దరి మధ్య మాటలు కలవటంతో స్నేహం కాస్త ప్రేమగా వికసించింది. మాట్లాడుకోకపోతే ఆ రోజు గడిచేది కాదు. నువ్వా దరి.. నేనీ దరి అన్నట్లు ఇద్దరి దేశాలు వేరైనా సోషల్ మీడియా పుణ్యమా అని ఇద్దరూ రోజు మాట్లాడుకునేవారు.
ఏడాదికి పైగా సాగిన స్నేహానికి ఎండ్ కార్డ్ వేయాలని నిర్ణయించుకున్న భరత్ ఒక ఫైన్ డే తన మనసులో మాట బయటపెట్టాడు. నువ్వంటే నాకిష్టమని చెప్పాడు. అందుకు శ్యామల కూడా ఓకే చెప్పింది. ఇరువురు తమ ప్రేమను పెద్దలకు చెప్పటం వారు కూడా అంగీకరించటంతో భరత్-శ్యామల పరిచయం పెళ్లిపీటలు ఎక్కింది. ఈనెల 10న వారిద్దరు ఒక్కటి కానున్నారు. భారత్-పాక్ల మధ్య వైరమే తప్ప ప్రజల మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని, అందుకు తమ ప్రేమపెళ్లే నిదర్శనమని కాబోయే జంట అంటోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.