ఈ మధ్య వరుస రైలు ప్రమాదాలతో రైల్వేశాఖ అప్రమత్తం అవుతోంది. ట్రైన్ యాక్సిడెంట్లో వందలాది ప్రయాణికుల ప్రాణాలకు హాని కలగకుండా కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ నుంచి లఖ్నవూకు బయలుదేరిన గోమతి ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది.
ఇటీవల జరిగిన ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ ఘటన దేశవ్యాప్తంగా ఉలిక్కిపడేలా చేసింది.ఈ దుర్ఘటన యావత్ భారతదేశ ప్రజల గుండెల్లో గుబులు రేపింది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ బాలేశ్వర్ సమీపంలో ఘోర రైల్వే ప్రమాదం చోటుచేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో 295 మంది ప్రాణాలు కోల్పోగా.. వెయ్యిమందికి పైగా గాయపడ్డారు. ఇంత దారుణ పరిస్థితి కళ్లారా చూసిన వారికి హృదయం చలించింది. దీని తర్వాత ఈ ఘటన తరహాలో రెండు రైళ్లను ఢీకొనేలా చేస్తామని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బెదిరిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులకు లేఖ రాశారు. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో బొమ్మాయిపల్లి సమీపంలో ఫలక్నూమా ఎక్స్ప్రెస్ అగ్నిప్రమాదానికి గురైంది.
ఇలా వరుస ఘటనలతో రైల్వేశాఖ అధికారులు ఎక్కడి నుండి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో గోమతి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో భోలకా పురా గ్రామానికి చెందిన భన్వర్సింగ్ అనే రైతు.. శుక్రవారం ఉదయం 6.00 గంటలకు పొలం దగ్గరికి వెళుతూ లాల్గోపాల్గంజ్ సమీపంలో రైల్వేట్రాక్పై పగుళ్లను చూశాడు. అదే సమయంలో ప్రయాగ్రాజ్ నుండి లఖ్నవూకు బయలుదేరిన గోమతి ఎక్స్ప్రెస్ పట్టాలపై రావడం గుర్తించాడు.
వెంటనే భన్వర్సింగ్ తన వద్ద ఉన్న ఎర్రటి వస్త్రాన్ని చేతితో ఊపుతూ ట్రైన్ ఆపాలంటూ కేకలు వేశాడు. రైతును చూసి లోకోఫైలట్ ట్రైన్ ఆపేశాడు. పట్టాలపై పగుళ్లను లోకోఫైలట్ గుర్తించాడు. వందలాది మంది ప్రాణాలను కాపాడినందుకు భన్వర్సింగ్ను అభినందించాడు. పెను ప్రమాదం తప్పిందంటూ కృతజ్ఞతలు తెలిపాడు. రైల్వే అధికారులకు సమాచారం చేరవేయడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. మరమ్మతులు పూర్తి అయిన తర్వాత రైళ్లు యథావిధిగా కొనసాగాయి.