ఆమె ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన మహిళ. వయసు 22 ఏళ్ళు. 22 ఏళ్ళకే అంతర్జాతీయ కంపెనీలో 64 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందారు.
రమ్య ఆర్ (22) తమిళనాడుకి చెందిన ఒక సాధారణ రైతు బిడ్డ. ఈమె సింగపూర్ కి చెందిన కంపెనీలో పెద్ద ఉద్యోగం పొందడంతో ఒక చరిత్రను సృష్టించారు. రికార్డ్ స్థాయిలో ఆమెకు అక్కడ కంపెనీ ప్యాకేజీ చెల్లిస్తుంది. ఒడిశా రాష్ట్రంలోని సంబల్పూర్ పట్టణంలో ఉన్న ఐఐఎం క్యాంపస్ ఇంటర్వ్యూలో ఏడాదికి రూ. 64.15 లక్షల ప్యాకేజీతో జాబ్ కొట్టారు. సింగపూర్ తోలారం గ్రూప్ కంపెనీ నిర్వహించిన 5-6 రౌండ్ల ఇంటర్వ్యూలో పాసై ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆమెకు ఉన్న మేనేజ్మెంట్, అనలిటికల్ స్కిల్స్ కారణంగా హయ్యెస్ట్ ప్యాకేజీ ఇచ్చి మరీ ఉద్యోగం ఇచ్చింది సింగపూర్ కంపెనీ. నైజీరియాలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ అయిన తోలారం కంపెనీలో సేల్స్ మేనేజర్ గా ఉద్యోగం వచ్చింది. దీంతో రమ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
రమ్య తమిళనాడులోని సేలంలో పుట్టి పెరిగారు. అక్కడే నమక్కల్ లో లిటరేచర్ చదివారు. ఆశ్చర్యం ఏమిటంటే.. ఆమె కుటుంబంలో రమ్యనే మొదటి గ్రాడ్యుయేట్ కావడం. ఈమె రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. కష్టపడి ఐఐఎంలో చేరి బాగా చదివారు. ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించుకున్నారు. నైజీరియాలో ఉన్న తోలారం గ్రూప్ కంపెనీలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. ఈ శుభ సందర్భంగా ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఐఐఎం సంబల్పూర్ లో చదువుతున్నప్పుడు ఆమె ప్రయాణం గురించి ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఐఐఎం సంబల్పూర్ ఇన్స్టిట్యూట్ కి, అలానే తనను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఫ్యాకల్టీకి రుణపడి ఉంటానని ఆమె అన్నారు. అలానే తన విజయాన్ని ఆమె తల్లిదండ్రులకు అంకితమిస్తున్నానని.. ఈ విజయం వారిదేనని ఆమె అన్నారు. తన తల్లిదండ్రులు రైతులని.. వాళ్ళే తాను కష్టపడేలా, ఏ పని చేసినా రాణించేలా ప్రభావితం చేశారని అన్నారు. తన గ్రామంలోని ఆడపిల్లలు చదువు కోసం బయటకు వెళ్లేవారు కాదని.. కానీ తన తల్లిదండ్రులు తనను ఎంతగానో ప్రోత్సహించారని అన్నారు. ఇప్పుడు ఆడపిల్లలు బయటకు వచ్చి చదువుకునే పరిస్థితి వచ్చిందని.. ఉన్నత విద్య కోసం తనలానే చాలామంది బయటకు వస్తారని నమ్ముతున్నానని ఆమె తెలిపారు.