గుజరాత్ లో అక్రమ మద్యం అమ్మకంగానీ, తాగడం గానీ, రవాణా చేయడంగానీ నిషేదం. ఆ రాష్ట్రంలో అక్రమంగా మద్యం విక్రయిస్తే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధిస్తారు. అందుకే ముగ్గురు నిందితులు మందు బాటిళ్లు ఎవరికీ కనిపించకుండా ఉండాలని పశువుల పాకలో గేదెలు నీళ్లు తాగే తొట్టిలో దాచిపెట్టారు. అయితే, ఇటీవల ఆ బాటిళ్లలో ఒకటి పగిలిపోవడంతో అందులో ఉండే మందు నీళ్లలో కలిసిపోయింది. అలా మందు కలిసిన నీటిని తాగిన గేదెలు వింతగా ప్రవర్తించడం, వాటి నోటి నుంచి నురుగ రావడం మొదలైంది. గేదెల వింత ప్రవర్తనకు ఆందోళన చెందిన ఒక రైతు పశు వైద్యుడ్ని రప్పించాడు. గేదెలు తాగిన నీటి వాసన, రంగును పరిశీలించిన ఆ పశువైద్యుడు అందులో మద్యం కలిసినట్లు గుర్తించాడు.
అక్రమ సారా అమ్మకాల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సోమవారం ఆ పశుశాలపై పోలీసులు రైడ్ చేశారు. అక్కడ రహస్యంగా దాచిన రూ.32,000 విలువైన వంద మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రైతులను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. గేదెలు ప్రస్తుతం కోలుకుంటున్నాయి.