వాట్సాప్, టెలిగ్రామ్, వంటి సోషల్ మీడియా యాప్ ల వినియోగానికి సంబంధించి మోదీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక మీదట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమైన పత్రాలను పంపించడానికి గాను ఈ యాప్ లను వాడకూడదని స్పష్టం చేసింది. ఈ యాప్ ల ద్వారా డాక్యుమెంట్లను పంపిస్తే.. అవి దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను హెచ్చరించింది. ఈ యాప్ ల సర్వర్లు విదేశాల్లో ఉన్నాయని.. వీటి ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని పంపిస్తే.. అవి హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్న ఉద్యోగులు ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని కేంద్రం సూచించింది. వీరంతా డాక్యూమెంట్స్ పంపించడం కోసం ఇ-ఆఫీస్ అప్లికేషన్ (e- office applications) మాత్రమే వాడాలని కేంద్రం స్పష్టం చేసింది.
వర్చువల్ మీటింగ్ కు సంబంధించి కూడా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికారులు వర్చువల్ మీటింగ్స్ కోసం గూగుల్ మీట్, జూమ్ (Google Meet, Zoom) లాంటి ప్రైవేట్ యాప్స్ ను అస్సలు వినియోగించకూడదని కేంద్రం స్పష్టం చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC), నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(NIS) డెవలప్ చేసిన వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్స్ మాత్రమే వినియోగించాలని సూచించింది. వీటిని వినియోగిస్తున్నప్పుడు పాస్వర్డ్స్ ను తప్పనిసరిగా వాడాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇంకా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ ల వినియోగంపై కూడా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
దేశ భద్రతకు సంబంధించి నిర్వహించే కీలక సమావేశాలకు హాజరయ్యే సమయంలో అధికారులు స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లను వెంట తీసుకురావొద్దని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రహస్య సమాచారం లీక్ కావడంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. జాతీయ కమ్యూనికేషన్ నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలను ఈ యాప్స్ నిరంతరం ఉల్లంఘిస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రూపొందించిన ఆదేశాలను కేంద్రం విడుదల చేసింది. ఈ ఆదేశాలను అన్నీ మంత్రిత్వ శాఖల అధికారులు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.