వాహనదారులు ఈ కొత్త రూల్స్ తెలుసుకోవాలి. ఈ తప్పు చేస్తే రూ.20 వేలు జరిమానా పడొచ్చు. అందుకే ఈ కొత్త రూల్స్ను వాహనదారులు తప్పకుండా గుర్తుంచుకోవాలి.
రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది. ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రమనే తేడాల్లేకుండా దేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో రోజూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నగరాల తర్వాత ఎక్కువగా యాక్సిడెంట్లు హైవేల పైనే జరుగుతుంటాయి. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యం, మద్యపానం తాగి వాహనాలు నడపడం లాంటివి ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి. అయితే వెహికిల్స్ కండీషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. టైర్లు పంచర్ కావడం వల్ల లేదా పేలిపోవడం, స్కిడ్ కావడం వల్ల వల్ల ప్రమాదాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. అందుకే ప్రయాణాలు చేసేవారు టైర్ల కండీషన్ను కచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండాలి.
టైర్ల కండీషన్ బాగుంటేనే జర్నీ మొదలుపెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ విషయంలో మహారాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. టైర్ల కండీషన్ సరిగ్గా లేకపోతే రోడ్ల మీదకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. నాగ్పూర్-ముంబై ఎక్స్ప్రెస్ వే మీద టైర్లు సరిగా లేని వెహికిల్స్ను ఆర్టీవో నిషేధించింది. ఈ ఎక్స్ప్రెస్ వేపై టైర్లు బాగోని వాహనాలు వెళ్లకుండా బ్యాన్ విధించింది. ఒకవేళ టైర్లు సరిగా లేకపోయినా ఎక్స్ప్రెస్ వే మీద వెళ్తే మాత్రం ఏకంగా రూ.20 వేల వరకు జరిమానా పడుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వేపై జరుగుతున్న ప్రమాదాల్లో చాలా మటుకు టైర్ల కండీషన్ బాగోకపోవడం వల్లే చోటుచేసుకుంటున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది.