తల్లిదగ్గర పాలు లేనప్పుడు.. పుట్టిన బిడ్డ ఆకలితో పాల కోసం గుక్కపట్టి ఏడుస్తుంటే.. ఆ మాతృతల్లి పడే క్షోభ వర్ణనాతీతం. బిడ్డ ఆకలి నింపే ఆ పాల విలువ ఆ భాధ పడ్డ తల్లికే తెలుస్తుంది. ఎన్నో విషేషాలు దాగున్న అమ్మపాలను అమృతంతో సమానం అంటారు. అలాంటి అమృతాన్ని పంచె తల్లి ఇప్పుడు అంగట్లో బేరమై కూర్చుంది. ఒక తల్లి తన బిడ్డ నోరు కట్టేసి.. సంపన్న పిల్లలకు పాలు అమ్ముకునే రోజులు ఎందుకొచ్చాయి. ఆ తల్లిని పేదరికం నుంచి బయటపడేసేందుకు మార్గాలు కల్పించకుండా.. తన రక్తంతో వృద్ధి అయిన పాలను అమ్ముకునే పరిస్థితులు మాతృతల్లికి రావడం దేశానికే దురదృష్టకరం.
ఏ బిడ్డకు అయినా తల్లే ఆధారం. కడుపులో ఉన్నప్పుడు, కడుపులో నుండి బయటపడినప్పుడు కూడా శిశువు అన్ని అవసరాలు తీర్చేది తల్లే. కడుపులో ఉన్నప్పుడు బిడ్డ శరీర అవయవాలు ఒక విధంగా అభివృద్ధి చెందితే, బిడ్డ పుట్టిన తరువాత శరీర అవయవాల అభివృద్ధి మూడు నెలల్లో రెట్టింపుగా పెరుగుతాయి. కారణం ఒక్కటే. తల్లిపాలు. అలాంటి తల్లిపాలు మనదేశంలో అమ్మకానికి పెట్టరు అని ఇన్నాళ్లు అందరూ భావించారు. అయితే.. మన దేశంలో కూడా రొమ్ము పాలకు రేటు కడుతున్న ఒక సంస్థ ఉంది. దాని పేరే నియోలాక్టా లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. మాతృమూర్తి క్షీరాన్ని సైతం మార్కెట్ వస్తువుగా మార్చి లాభాలు ఆర్జిస్తున్న ఈ కంపెనీ ఇండియాలో తప్ప ఆసియాలోని మరే దేశంలోనూ లేకపోవటం సిగ్గుచేటు.
ఇది కూడా చదవండి: Software Engineer: అమ్మ కోసం.. లక్షకుపైగా జీతం వస్తున్న ఉద్యోగం వదిలేసిన కుమారుడు!
2016లో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు మొదలుపెట్టిన నియోలాక్టా లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరీ ప్రొడక్టుల కేటగిరీలో ఎఫ్ఎస్ఎస్ఎస్ఐ(FSSAI) నుంచి అనుమతి తీసుకుంది. నిజానికి సదరు సంస్థ FSSAI నుండి పాల ఉత్పత్తులను విక్రయించడానికి మాత్రమే లైసెన్స్ పొందింది. అందులో తల్లిపాలను కూడా కలిపేసి చీకటి వ్యాపారాన్ని మొదలుపెట్టింది. 300 మి.లీ గడ్డకట్టిన తల్లి పాలకు రూ.4,500 వసూలు చేస్తోంది. అలాగే తల్లి పాల పౌడర్ ను సైతం తమ కంపెనీ ఈ కామర్స్ వెబ్ సైట్లలో విక్రయిస్తోంది. ఈ చీకటి వ్యాపారంపై పిర్యాదులు అధికమవ్వడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిషేధించిన మెటీరియల్ను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు కంపెనీపై చర్యలు చేపట్టడమే కాకుండా వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.