ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్లో లాక్డౌన్ ఉల్లంఘించిన ఓ వ్యక్తిపై కలెక్టర్ చేయిచేసుకున్న వ్యవహారం మరవక ముందే అదే తరహా ఘటన మధ్యప్రదేశ్ షాజాపూర్లో జరిగింది. లాక్డౌన్ ఉల్లంఘించి చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న యజమానిపై షాజాపూర్ అదనపు కలెక్టర్ మంజూషా విక్రంత్రాయ్ చేయి చేసుకున్నారు. లాక్డౌన్ పరిస్థితిని సమీక్షించేందుకు రోడ్డుపైకి వచ్చిన ఆమె.. షాపు తెరచి ఉంచిన యజమాని చెంప పగలగొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అదనపు కలెక్టర్ వ్యవహారంపై తమకు సమాచారం అందిందని మధ్యప్రదేశ్ మంత్రి ఇందర్సింగ్ పర్మార్ పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ తీరు సరిగా లేదన్నారు. అవసరమైతే ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లా కలెక్టర్ రణ్బీర్ శర్మ.. లాక్డౌన్ పరిస్థితులను సమీక్షించేందుకు రోడ్డుపైకి వచ్చి బయట కనిపించిన ఓ వ్యక్తి చెంపపై కొట్టారు. ఆ యువకుడి చరవాణి సైతం నేలకేసి కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అత్యుత్సాహం ప్రదర్శించిన రణ్బీర్ శర్మ ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. సూరజ్పూర్ కలెక్టర్ బాధ్యతల నుంచి ప్రభుత్వం ఆయన్ను తప్పించింది. నూతన కలెక్టర్గా మరొకరిని నియమించింది.