వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకుంటున్నాడని ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పెళ్లి ఆపాలంటూ పోలీసులను కోరింది.
అమ్మ చనిపోయింది. తండ్రి రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడు. ఏ పిల్లలైనా ఏం చేస్తారు. ఏమైనా చేసే వయసా పోనీ. పదేళ్లు వయసు అంటే ఆడుకునే వయసు. ఆలోచించే వయసు కూడా కాదు. అయితే వచ్చే ఆవిడ అమ్మవుతుందో లేక పిన్ని అవుతుందో తెలియదు. అసలు పట్టించుకుంటుందన్న గ్యారంటీ లేదు. మరి ఇటువంటి సమయంలో ఉన్న ఒక్క నాన్న ఆమె వైపు వెళ్ళిపోతే ఇక పిల్లల పరిస్థితి ఏంటి? సరిగ్గా ఆ అమ్మాయి ఇదే ఆలోచించింది. రెండో పెళ్లి చేసుకుంటే తమ బతుకులు అన్యాయం అయిపోతాయని ఆలోచించి పెళ్లిని ఆపేసింది. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. బీహార్ లోని షియోహర్ కి చెందిన పదేళ్ల బాలిక తన తండ్రి రెండో పెళ్లి చేసుకుంటే ఆపే ప్రయత్నం చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.
పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన తండ్రి రెండో పెళ్లిని ఆపాలంటూ పోలీసులకు మొర పెట్టుకుంది. ఈమె తండ్రి పేరు మనోజ్ కుమార్ రాయ్. ఇతనికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అందరూ 12 ఏళ్ల లోపు వయసున్న పిల్లలే. రెండేళ్ల క్రితం మనోజ్ తన భార్యను కోల్పోయాడు. అయితే తమ తండ్రి స్థానిక గుడిలో వేరే మహిళను పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకున్న చోటి కుమారి.. గ్రామస్తులతో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. తన తండ్రి పెళ్లి ఆపాలని రిక్వస్ట్ చేసింది. తమ తండ్రి వేరే పెళ్లి చేసుకుంటే మేము అన్యాయమైపోతామని పోలీసులతో అన్నది. అంతేకాదు ఉన్న అరెకరం భూమి తన తండ్రి చేసుకోబోయే మహిళకు రాసిచ్చాడని, భూమి లేకపోతే మేము ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
తమ తండ్రి తప్ప తమను పట్టించుకునే వాళ్ళు లేరని, దయచేసి పెళ్లి ఆపాలంటూ వేడుకొంది. పాప బాధ విన్న పోలీసులు పెళ్లి జరుగుతున్న గుడి దగ్గరకు వెళ్లారు. పెళ్లి ఆపి రెండో పెళ్లి చేసుకుంటున్న తండ్రిని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. స్థానిక పంచాయితీ పెద్దలను, సర్పంచ్ ని, ఇతర గ్రామ పెద్దలను పిలిపించారు. అందరూ కలిసి పిల్లల బాధ్యత తీసుకుంటానని బాండ్ పేపర్ల మీద సంతకం చేయాలని మనోజ్ పై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ తండ్రి పెళ్ళి ఆలోచనను విరమించుకుని పిల్లలను బాగా చూసుకుంటానని ప్రామిస్ చేస్తూ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టాడు. దీంతో ఆ పాప చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు. పాప చేసిన ఈ పనిపై మీ అభిప్రయామేమిటో కామెంట్ చేయండి.