విశాఖపట్నం- ఆంద్రప్రదేశ్ కు విశాఖపట్నం వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మహారాష్ట్రలోని విదర్భ పరిసర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. మహారాష్ట్ర మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపురాయలసీమ, కోస్తా ప్రాంతంలో ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రానున్న రెండు, మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, దానికి ఆనుకొని హిందూ మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 14న ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది.
ఉపరితల ఆవర్తనం ఈనెల 16 నాటికి తూర్పు అరేబియా సముద్రంలో తుఫాన్గా మారే అవకాశం ఉందని అంచనా విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. వాతావరణంలో మార్పుల కారణంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి ఉత్తర కోస్తాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పాటూ మరికొన్ని చోట్ల మంగళవారం సాయత్రం ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడ్డాయి. విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లోనూ ఈదురు గాలులతో వర్షం కురిసింది. రానున్న రెండు రోజులు కూడా కోస్తా, రాయల సీమాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడటంతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.