సరిహద్దులో ఓ వైపు చైనా, మరోవైపు పాకిస్తాన్ తమ దుష్ట పన్నాగాలతో భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాయి. భారత్ వీటి చర్యలకు ధీటుగా సమాధానం చెప్తోంది. ఇక అంతర్జాతీయ సమాజంలో కూడా ఈ అంశంలో భారత్ కు మద్దతు బాగానే లభిస్తోంది. తాజాగా ఇండియా విషయంలో చైనా ఆగడాలకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా వల్ల భారత్ పలు భౌగోళిక, రాజకీయ సమస్యలు ఎదుర్కొంటుందని.. ఈ విషయంలో భారత్ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. క్వాడ్ సమావేశాల్లో భాగంగా ఇండో-పసిఫిక్ వ్యూహాత్మక నివేదికను అమెరికా విడుదల చేసింది. భారత్కు అతిపెద్ద ముప్పు చైనానే అని స్పష్టం చేసింది. ఈ ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తామని అమెరికా తెలిపింది.
భారత్ను భౌగోళిక రాజకీయ సవాళ్లు చట్టుముట్టి ఉన్నాయని అమెరికా ఈ నివేదికలో వెల్లడించింది. ప్రత్యేకించి వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) విషయంలో చైనా ప్రవర్తన భారత్కు పెను సవాల్ గా మారింది అని నివేదికలో తెలిపింది. శుక్రవారం అమెరికా విడుదల చేసిన ఈ వ్యూహాత్మక నివేదిక.. అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలోని పరిపాలన విభాగం మొట్ట మొదటి ప్రాంతీయ నిర్దిష్ట నివేదిక. ఇది ఇండో-పసిఫిక్లో అమెరికా స్థానాన్ని దృఢం చేయడం, ఈ ప్రాంతాన్ని బలోపేతం చేయడం, ఈ ప్రక్రియలో భారత్ ఎదుగుదలకు, ప్రాంతీయ నాయకత్వానికి మద్దతు ఇచ్చేందుకు అధ్యక్షుడి విజన్ను సూచిస్తోంది.
“వ్యూహాత్మక భాగస్వామ్య నిర్మాణాన్ని కొనసాగిస్తాం. దక్షిణాసియాలో స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి అమెరికా, భారత్ ప్రాంతీయ సమూహాలతో కల పని చేస్తాయి. ఆరోగ్యం, అంతరిక్షం, సైబర్స్పేస్, ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంచుకుంటాం. స్వేచ్ఛ, బహిరంగ ఇండో-పసిఫిక్ కోసం ముందుకుసాగుతాం” అని వైట్ హౌస్ ఈ నివేదికలో తెలిపింది.మెల్బోర్న్లో జరుగుతున్న క్వాడ్ సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సమావేశాల్లో భాగంగా భారత్, అమెరికా విదేశాంగశాఖ మంత్రులు జైశంకర్, ఆంటోనీ బ్లింకెన్ భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, అఫ్గానిస్థాన్లో ప్రస్తుత పరిస్థితులు, రష్యా- ఉక్రెయిన్ సంక్షోభం, మయన్మార్లో ప్రజాస్వామ్యం భవిష్యత్తు, కొవిడ్ తాజా పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. క్వాడ్ కూటమి ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ.. సరిహద్దులో ఉద్రిక్తతలకు చైనానే కారణమని వెల్లడించారు. ఆ దేశం లిఖితపూర్వక ఒప్పందాలను ఉల్లంఘించడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. సరిహద్ధులో సైన్యాన్ని భారీగా మోహరించవద్దని ఒప్పందంలో ఉన్న చైనా దాన్ని పెడచెవిన పెడుతోందని జై శంకర్ విమర్శించారు. అమెరికా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.