కరోనాగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి డెల్టా, ఒమిక్రాన్.. అంటూ రూపాన్ని మార్చుకుంటూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి బెడద ఇప్పట్లో వదిలేలా లేదు. రూపు మార్చుకున్న ప్రతిసారి ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. దీని దెబ్బకు ఓ వ్యక్తి కొన్ని నెలలుగా ఐసోలేషన్లోనే ఉంటున్నాడు. ఎన్నిసార్లు టెస్ట్ చేసినా కోవిడ్ పాజిటివ్గానే ఫలితం రావడంతో ఇంట్లో ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 14 నెలలుగా ఉంటున్నాడు. ఇప్పటికి 78 సార్లు పరీక్షలు చేయగా అన్ని సార్లు పాజిటివ్గా తేలింది. దీంతో ఎవరిని కలవకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు.
ఇది కూడా చదవండి : కొవిడ్ వచ్చిన తర్వాత భారత్ లో రికార్డు స్థాయిలో డోలో-650 అమ్మకాలు
లుకేమియా వ్యాధిగ్రస్తుడైన అయిన ముజాఫర్ కయాసన్కు నవంబర్ 2020లో మొదటిసారి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షించగా పాజిటివ్ గా తేలింది. దాంతో ఆస్పత్రిలో చేరాడు. రెండు వారాల తర్వాత డిశ్చార్జ్ అయి ఇస్తాంబుల్లోని సరియర్ జిల్లాలోని తన ఇంటికి వచ్చారు. పూర్తిస్థాయిలో కోలుకోవడానికి సమయం పడుతుండడంతో ట్రీట్మెంట్ కంటిన్యూ చేశాడు. కొన్ని రోజులకు అతనిలో వైరస్ లక్షణాలన్నీ పోయాయి.కానీ టెస్ట్ చేస్తే మాత్రం పాజిటివ్ అనే వచ్చింది. చేసేదేం లేక మళ్లీ ఆస్పత్రిలో చేరాడు. తర్వాత చాలాసార్లు టెస్ట్ చేయించగా ఫలితం మాత్రం పాజిటివ్ అనే వచ్చింది.
ఇక లాభం లేదని తిరిగి ఇంటికి వచ్చేసి ఒంటరిగా ఉండడం మొదలుపెట్టాడు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.. మందులు వాడుతున్నాడు అయినా రిజల్ట్ మాత్రం మారడంలేదు. 14 నెలలుగా ఐసోలేషన్లోనే ఉంటూ అవస్థలు పడుతున్నాడు. ఉన్నవారిని కలుసుకోలేక, బంధువులు, స్నేహితులతో మాట్లాడే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నాడు. ముజాఫర్ కయాసన్ లుకేమియా రోగి కావడంతో అతడి రోగ నిరోధక వ్యవస్థ సరిగా పనిచేయక ఇలా అవుతుందని అక్కడి వైద్యులు చెపుతున్నారు. కరోనా వైరస్ పై పోరాడేందుకు అవసరమైన యాంటీబాడీలు ఉత్పత్తి కావడం లేదని అందుకే అతడికి కరోనా నెగెటివ్ రావడం లేదని అంటున్నారు వైద్యులు. దీని నుంచి ముజాఫర్ ఎప్పుడు బయటపడతాడో తెలియని పరిస్థితి.