విహార, తీర్థ యాత్రలు, పండుగలు, అన్నీ ముఖ్యమైనవే అయినప్పటికీ ప్రజలు మరికొద్ది నెలలు సంయమనం పాటించాలని ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) సూచించింది. ఓవైపు అందరికీ వ్యాక్సిన్ అందనే లేదని అయినా సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రజలకు అనుతివ్వడమంటే థర్డ్ వేవ్కు కారణమయ్యే ‘‘సూపర్ స్ర్పెడర్ల’’ను అందించినట్లేనని హెచ్చరించింది. ఆర్ధిక , వాణిజ్య ఒత్తిళ్లతో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తుండడం సామాజిక దూరం, శానిటైజేషన్, వ్యాక్సినేషన్ ను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం తదితర పరిణమాలు థర్డ్ వేవ్ కు చేరువ చేస్తున్నాయి.
ముందు జాగ్రత్త చర్యలను తీసుకునే విషయంలో నెలకొన్న అశ్రద్ధ దీనికి కారణమౌతోందని చెప్తున్నారు. మనకు మనమే సూపర్ స్ప్రెడర్లుగా మారుతోన్నామని చెప్తున్నారు. కరోనా ఆర్ వేల్యూ పెరుగుదలపై చెన్నైలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్ (ఐఎంఎస్సీ) సైంటిస్టులు చేసిన పరిశోధనల ఫలితాలు థర్డ్ వేవ్ ముప్పును సూచిస్తోన్నాయి. చెన్నై, పుణేలోని వైరాలజీ ల్యాబ్ నిపుణుల అధ్యయనం ప్రకారం సెకండ్ వేవ్ కు ముందు పరిస్థితులు ఆ తర్వాత పరిస్థితులను విశ్లేషించారు. కేసులు తగ్గుముఖం పట్టినా యాక్టివ్ కేసులు తగ్గలేదని స్థిరంగా కొనసాగుతున్నాయని తేల్చారు. ఇదే పరిస్థితి కొనసాగితే థర్డ్ వేవ్ మొదలై ఉప్పెనలా విరుచుకుపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధారాలు, చరిత్రను ఓసారి పరిశీలించాలని ఐఎంఏ సూచించింది. కరోనా పోయిందన్న భావనతో జాగ్రత్తల పాటింపులో ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు అలసత్వం కనబరుస్తుండటం, సామూహిక సమావేశాల్లో పాల్గొనడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది. జనం పెద్దఎత్తున గుమిగూడే కార్యక్రమాలను నిరోధించాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.