వర్జిన్ గెలాక్టిక్ కు చెందిన వ్యోమనౌక అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ‘‘వర్జిన్ స్పేస్ మిషన్’’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఆరుగురు వ్యోమగాములు కొన్ని నిమిషాలపాటు అంతరిక్ష యాత్ర చేసి భూమిపైకి తిరిగి వచ్చారు. సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు తెలుగు అమ్మాయి బండ్ల శీరీష దిగ్విజయంగా అంతరిక్ష యాత్ర చేసొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర విజయవంతం కావడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు లేటెస్ట్ గా అంతరిక్షంలోకి ప్రయాణించే తొలి రోదసి యాత్రికుడిగా కేరళకు చెందిన ప్రసిద్ధ పర్యాటకుడు సంతోశ్ జార్జ్ కులంగర చరిత్ర సృష్టించబోతున్నారు.
ఈ యాత్ర కోసం ఆయన రూ. 1.8 కోట్లు (2.5 లక్షల డాలర్లు) ఖర్చు చేయబోతున్నారు. రోదసియాత్ర చేసిన తొలి భారత పర్యాటకుడిగా ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మళయాళీల తరపున తాను ఈ యాత్రను చేపడుతున్నానని చెప్పారు. అంతరిక్షంలోకి వెళ్లే సమయంలో తనతో పాటు ఓ కెమెరాను కూడా తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. సంతోశ్ గత 24 ఏళ్లలో 130కి పైగా దేశాలను చుట్టొచ్చారు. అమెరికాలోని వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన వ్యోమనౌకలో ఆయన టికెట్ రిజర్వ్ చేసుకున్నారు.
‘సంచారం‘ పేరుతో యాత్రా విశేషాలను వివరించే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 1800 ఎపిసోడ్దలను ప్రసారం చేశారు. మరోవైపు, అంతరిక్ష యాత్రను చేపట్టాలని 2007 నుంచి యత్నిస్తున్నారు. దీని కోసం శిక్షణ కూడా తీసుకున్నారు.