అదితి అనే 10 ఏళ్ల బాలిక తన పేరెంట్స్తో కలిసి యూరప్లోని చాలా ప్రాంతాలను చుట్టేశారు. ప్రతి ఏటా టూర్స్ ప్రొగ్రాం ప్రణాళిక ప్రకారం పెట్టుకుంటారు. అదితి స్కూల్ మిస్ కాకుండా ప్రతి విషయంలో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు.
స్కూల్కు వెళ్లే పిల్లలు సాధారణంగా ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయని ఎదరుచూస్తుంటారు.కొందరు పిల్లలైతే వారికి కడుపునొప్పి అని ఏవో సాకులు చెప్పి బడి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. పేరెంట్స్ చెప్పినా కూడా వినకుండా బడి మానేసి ఇంట్లో ఉంటారు. ఎంజాయ్ చేసే టైంలో కూడా బడి మానేయాని ఆలోచిస్తారు. కానీ అదితి త్రిపాఠి అనే పదేళ్ల బాలిక తన పేరెంట్స్తో కలిసి ఇప్పటికే 50 దేశాలను చుట్టేసి వచ్చింది. అయినా కూడా ఏ ఒక్కరోజు కూడా బడి మిస్ చేయకుండా టూర్స్ వెళ్లి వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
Yahoo Life UK ప్రకారం, అదితి అనే అమ్మాయి తండ్రి దీపక్, తల్లి అవిలాషాతో కలిసి సౌత్ లండన్లో నివసిస్తున్నారు. తన పేరెంట్స్తో కలిసి యూరప్లోని చాలా ప్రదేశాలను సందర్శించింది. అదితి తల్లిదండ్రులు తమ కూతురు అన్ని ప్రదేశాలను చూడాలని దానికి తగ్గట్లుగా వారు ప్లాన్ చేశారు. తమ బిడ్డ ప్రపంచంలోని భిన్న సంస్కృతులు, విభిన్న ఆహారాలు, భిన్నమైన వ్యక్తులను చూడాలని ఆకాంక్షించారు. దానికి తగ్గట్లుగా ప్రణాళికను తయారు చేసేవారు. అదితికి సెలవులు ఉన్న రోజుల్లోనే టూర్స్ ప్రొగ్రామ్స్ పెట్టుకునేవారు. ప్రతి సంవత్సరం పర్యటన కొరకు 20 వేల పౌండ్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.21 లక్షలకు పైగా ఖర్చు చేస్తారు.
తండ్రి త్రిపాఠి ‘నేపాల్, భారతదేశం, థాయ్లాండ్ దేశాలలో విభిన్న సంస్కృతులను చూసి ఆసక్తిగా, ఉత్సాహంగా ఉంటుంది. మూడేళ్ల వయసులో ఉన్నప్పటి నుండి అదితితో ప్రయాణాలు ప్రారంభించామని.. శుక్రవారం పాఠశాల నుండి నేరుగా తీసుకువెళ్లి.. ఆదివారం రాత్రి 11 గంటలకు తిరిగి లేట్ నైట్ ఫ్లైట్ వచ్చేస్తాం. కొన్నిసార్లు ఆమె విమానాశ్రయం నుంచి నేరుగా స్కూల్కు వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి’ అని తెలిపారు. అదితి పేరెంట్స్ సంవత్సరం పొడవునా తమ ప్రయాణాల కోసం పొదుపు చేస్తారు. అదితికి 2 ఏళ్ల చెల్లి అద్విత కూడా ఉంది. ఆమె సంరక్షణ కొరకు, పర్యటనల కోసం వారు ప్రణాళిక రూపొందించుకుంటారు. త్రిపాఠి ఒక ఏడాదిలో సుమారు 12 ప్రాంతాలను సందర్శిస్తారని తెలిపారు. థాయ్లాండ్, ఇండోనేషియా, సింగపూర్లను కూడా సందర్శించినట్లు తెలిపారు.
అదితికి ఇష్టమైన ప్రదేశం ఏదని అడిగితే.. ‘నాకు ప్రత్యేకమైన ప్రదేశం అంటూ ఏమీ లేదు. కానీ నేను మూడు ప్రదేశాలను చెప్పమంటే చెబుతాను.. అవి నేపాల్, జార్జియా, ఆర్మేనియా’ అని చెప్పింది. ‘నేపాల్ నాకు చాలా ఇష్టమైన వాటిలో ఒకటి. ఎందుకంటే నేను గుర్రపు స్వారీ చేశాను. అక్కడ పొడవైన కేబుల్ కారులో వెళ్లాను. ఎవరెస్ట్ పర్వతం చూశాను. నాకు ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం. దానితో ఆహ్లాదకరమైన జ్ఞాపకాలు మిగిలాయి. దీన్ని నేను ఇతర పిల్లలతో కూడా పంచుకుంటాను’ అని చెప్పింది. త్వరలో వారు ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియాలను కూడా సందర్శిచనున్నట్లు తెలిపారు.