ప్రకృతి విలయం సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. అలాంటి ప్రకృతి విలయానికి ఓ ఖండం విలవిలలాడుతోంది. తాజాగా అక్కడి ఓ దేశంలో తుపాను ధాటికి 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
ప్రకృతి విలయాల వల్ల కలిగే అనర్థాలు అంతా ఇంతా కావు. అధిక సంఖ్యలో ప్రాణ, ధన, ఆస్తి నష్టం కలుగుతుంది. దాని నుంచి కోలుకోవాలంటే చాలా ఏళ్లు పడుతుంది. ఇక, ఆఫ్రికాలోని మలావి అనే దేశంలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి 100 మందికి పైగా మృతి చెందారని తెలుస్తోంది. చనిపోయిన వారిలో ఇప్పటివరకు 60 మంది మృతదేహాలను గుర్తించారని సమాచారం. నెల వ్యవధిలో ఫ్రెడ్డీ తుపాను ఆఫ్రికాను రెండోమారు అతలాకుతలం చేయడం గమనార్హం. తుపాను ధాటికి ఎక్కడ చూసినా నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆ నీటి ప్రవాహంలో ప్రజలు కొట్టుకుపోతున్నారు. నీటి ప్రవాహంలో ఎక్కడికక్కడ పెద్ద పెద్ద భవనాలు కూలిపోతున్నాయి.
ఫ్రెడ్డీ తుపాను ధాటికి దక్షిణ, మధ్య ఆఫ్రికాలోని ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ వర్షంతో కూడిన గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. దీంతో దక్షిణ, మధ్య ఆఫ్రికాలో సహాయక చర్యలు చేపడుతున్న ఎమర్జెన్సీ టీమ్స్కు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మట్టి ఇళ్లే ఉండటంతో అవి ఎప్పుడు కూలి ప్రజల మీద పడతాయోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. చెట్లు కూలిపోయి, కొండచరియలు విరిగిపడిన ఘటనలో గాయపడిన వారిని మాలావిలోని బ్లాంటైర్ ఆస్పత్రికి తరలించి వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నదుల ప్రవాహం ఉధృతంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే చాన్స్ ఉందని ఆఫీసర్స్ అంచనా వేస్తున్నారు.