భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. గతేడాది కరోనా మొదటి వేవ్తో పోల్చుకుంటే ఇప్పటి పరిస్థితులు నరకాన్ని తలపిస్తున్నాయి. ఎటు చూసినా కరోనా పేషెంట్ల శవాల దిబ్బలే. అంత్యక్రియల కోసం స్మశానాల వద్ద క్యూలు కట్టాల్సిన పరిస్థితి. ఆస్పత్రిలో బెడ్లు కరువు. బెడ్లు దొరికినా ఆక్సిజన్ లభ్యతపై అనుమానాలు. ఇవన్నీ చూసి కరోనా సెకండ్ వేవ్ ఇంత భయంకరంగా ఉందేంటి? అని సామాన్యులు వణికిపోతున్నారు. ఐఐటీల సైంటిస్టులు సభ్యులుగా ఉన్న ప్రభుత్వ ప్యానెల్ అంచనాల ప్రకారం దేశంలో కరోనా రెండో దశ వేవ్ జులై చివరినాటికి అంతం అవుతుంది. ఇలాంటి సమయంలో సైంటిస్టులు మరో భయంకరమైన వార్త చెబుతున్నారు. దేశంలో కరోనా మూడో వేవ్ తప్పదంటూ బాంబు పేల్చుతున్నారు. అంతేకాదు మూడో వేవ్లో కరోనా బారిన పడిన వాళ్ల పరిస్థితి రెండ్రోజుల్లోనే విషమించే అవకాశాలుంటాయని తేల్చిచెబుతున్నారు.
శాస్త్రవేత్తలు చెప్తున్న విషయాలను ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న విధానం చూస్తుంటే థర్డ్ వేవ్ తప్పేలా లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కరోనా మొదటి వేవ్లో మనుషుల ఊపిరితిత్తులను నాశనం చేయడానికి వైరస్ 10 రోజుల సమయం తీసుకుంది. సెకండ్ వేవ్లో ఈ కాలం 5-7రోజులకు తగ్గిపోయింది. మూడో వేవ్ కనుక వస్తే 2 నుంచి 3 రోజుల్లోనే ఊపిరితిత్తులను వైరస్ నాశనం చేసి, బాధితులను ఐసీయూలో పడేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్న వేరియంట్ ఇదే పని చేస్తోందని స్పష్టం చేస్తున్నారు. ఈ వేరియంట్ సోకిన వారు 2-3 రోజుల్లోనే ఐసీయూకు చేరిపోతున్నారు. ఆ తర్వాత పరిస్థితులు విషమించి చనిపోతున్నారు. కరోనా వైరస్ ప్రభావం, కరోనా వేవ్స్పై అధ్యయనం చేస్తున్న కొంత మంది శాస్త్రవేత్తలు మరో షాకింగ్ విషయం వెల్లడించారు. అదేంటంటే కరోనా మొదటి వేవ్లో వృద్ధులపై వైరస్ దాడి చేసింది. సెకండ్ వేవ్లో యువకులపై ఎక్కువ ప్రభావం పడింది. మూడో వేవ్ గనుక వస్తే ఇది పిల్లలను టార్గెట్ చేస్తుందనేది శాస్త్రవేత్తల వాదన.