న్యూ ఢిల్లీ- ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. సెంకడ్ వేవ్ తరువాత భారత్ లో కనీస స్థాయికి వచ్చిన కరోనా కేసులతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఐతే ధర్డ్ వేవ్ పై చాలా బిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ధర్డ్ వేవ్ కొవిడ్ వస్తుందని కొందరు, రాకపోవచ్చని మరి కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో విదేశాల్లో వెలుగు చూసిన కొత్త కరోనా వేరియంట్ టెన్సన్ పుట్టిస్తోంది.
దక్షిణాఫ్రికా, హాంగ్కాంగ్, బోత్సువానాలో ఇటీవల వ్యాప్తి చెందుతున్న కొత్త కరోనా కరోనా వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ కొత్త వేరియంట్ వార్త ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈ నేపధ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి నిబంధనలను కట్టుదిట్టం చేసింది. భారత్ కు ఆఫ్రికా ఖండం మీదుగా వస్తున్న, వచ్చిన వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు గురువారం లేఖ రాసింది.
ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్న కొత్త కరోనా వేరియంట్ బీ. 1.1.1529 కారణంగా బోత్సువానాలో నాలుగు కేసులు, దక్షిణాఫ్రికాలో 22 కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. హాంకాంగ్ లో కూడా రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇతర వేరియంట్ల కంటే బీ. 1.1.1529 వైరస్ లో జన్యు మార్పులు అధికంగా ఉన్నాయని తెలిపారు. అందుకే అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.
అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో టెస్టింగ్, ట్రేసింగ్ నిబంధనలు మరింత పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా కరోనా కొత్త వేరియంట్ కారణంగా రిస్క్ ఎదుర్కొంటున్న దేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పలు శాఖలను ఆదేశించింది. ఆయా దేశాల నుంచి, లేదా వాటి మీదుగా వచ్చే ప్రయాణికులు, వారిని కలుసుకున్న వారి విషయంలో కాంటాక్ట్ ట్రేసింగ్ పటిష్టంగా నిర్వహించాలని స్పష్టం చేసింది.