దేశంలో కరోనావైరస్ తీవ్రంగా పెరుగుతున్న తరుణంలో ఉత్తరాఖండ్ హరిద్వార్లో నిర్వహించిన మహా కుంభమేళాకు మొత్తం 91 లక్షల మంది భక్తులు వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. జనవరి 14 నుంచి ఏప్రిల్ 27 మధ్య ఈ 91 లక్షల మంది గంగలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు కుంభమేళ ఫోర్స్ వెల్లడించింది. ఇందులో ఏప్రిల్ నెలలోనే 60 లక్షల మంది హరిద్వార్కు చేరుకున్నట్లు కుంభమేళా ఫోర్స్ వెల్లడించింది. అందులో ఏప్రిల్ 12న ఒక్కరోజే 35 లక్షల మంది రాగా అంతకుముందు శివరాత్రి సందర్భంగా మార్చి 11న 32 లక్షల భక్తులు వచ్చినట్లు కుంభమేళా నిర్వాహకులు తెలిపారు. ఈ నేపధ్యంలో ఓ సంగతి బయటికివచ్చింది. కుంభమేళాకు వెళ్లొచ్చిన ఓ మహిళ మొత్తం 33 మందికి కరోనా అంటించింది.
బెంగళూరుకు చెందిన ఓ 67 ఏండ్ల మహిళ ఉత్తరాఖండ్లో ఇటీవల జరిగిన కుంభమేళాకు వెళ్లొచ్చింది. అక్కడ్నుంచి వచ్చిన కొద్ది రోజులకే ఆమెకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. టెస్టు చేయించగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆ మహిళతో పాటు ఆమె కుటుంబంలోని మరో 18 మందికి కరోనా వ్యాపించింది. సదరు మహిళా కోడలు వెస్ట్ బెంగళూరులోని స్పందన హెల్త్కేర్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్లో సైక్రియాటిస్టుగా పని చేస్తోంది. ఆ సెంటర్లో ఉన్న 13 మంది రోగులతో పాటు ఇద్దరు సిబ్బందికి సైక్రియాటిస్టు నుంచి కరోనా వ్యాపించింది. అలా మొత్తం 33 మందికి కరోనా సోకింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు 67 ఏండ్ల మహిళ నివాసంతో పాటు ఆ పరిసరాలను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు.