చిత్తూరు క్రైం– బంగారం.. ఈ పేరు వింటేనే మహిళల మొహాల్లో వెలుగు వస్తుంది. బంగారం అంటే మక్కువ చూపని వారుంటారా చెప్పండి. అందులోను మన దేశంలో బంగారం సంప్రయాంలో భాగమని చెప్పవచ్చు. పైగా బంగారం అతి ఖరీదైన లోహం. దీంతో బంగారానికి అంత విలువ ఇస్తారు అంతా. ఐతే బంగారం కొనుగోళ్లలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా మోసపోవడం ఖాయం. తక్కువ ధరకే బంగారం అమ్ముతామని కేటుగాళ్లు చాలా మందిని మోసం చేసిన ఎన్నో ఘటనలను మనం చూశాం. అయినా గాని ఇంకా ఇలాంటి వాటిని నమ్మి కొంత మంది మోసపోతూనే ఉన్నారు.
ఇలా తక్కువ ధరకే బంగారం అమ్ముతామంటూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను ను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారుపాళ్యం మండలంలోని తుంబకుప్పం గ్రామానికి చెందిన చక్రపాణి, మస్తాన్, ఆసీస్, కుమార్, రాజు ఫ్రెండ్స్. చక్రపాణికి మదనపల్లి మండలం వేంపల్లికి చెందిన బావాజాన్కు మామిడి కాయల కొనుగోలు చేస్తున్న సమయంలో పరిచయాలు పెరిగాయి. ఈ క్రమంలోనే బావాజాన్ తమ వద్ద పాత బంగారం ఉందని, దాన్ని కిలో 10 వేల రూపాయలకే అమ్ముతానని చెప్పాడు. చక్రపాణి నిజమే అని నమ్మడంతో ముందు షాంపిల్ మాత్రం ఒరిజినల్ బంగారాన్ని చూపాడు బావాజాన్.
బంగారాన్ని కొనడానికి సిద్దమైన చంక్రపాణి అండ్ ఫ్రెండ్స్.. తమ దగ్గర డబ్బు లేదని తన స్నేహితుడు మస్తాన్ వద్ద ఉందని, ఆ డబ్బులతో బంగారం కొనుగోలు చేస్తామని చక్రపాణి చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీన మదనపల్లి మండలం వేంపల్లికి చెందిన బావాజాన్, అతని స్నేహితులు పుంగనూరు మండలం, ఈడిగపల్లెకు చెందిన నవీన్పాల్, సిద్ధలయ్య, వెంకటేశ్, శంకర్, ఈశ్వర్ రెడ్డి ముఠాగా ఏర్పడి చక్రపాణికి ఫోన్ చేశారు. మొగిలిఘాట్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకొని వస్తే బంగారం ఇస్తామని చెప్పారు. దీంతో చక్రపాణి, అతని స్నేహితుడు మస్తాన్ దగ్గర 15 లక్షల నగదు తీసుకొని మొగిలిఘాట్ వద్దకు వచ్చి బావాజాన్కు ఇచ్చారు. సంచిలో ఉన్న బంగారాన్ని వీరికి అందజేశాడు బావాజాన్.
సరిగ్గా ఆ సమయంలో ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం అక్కడే ఉన్న వెంకటేశ్, శంకర్, ఈశ్వర్రెడ్డిలు పోలీసులొస్తున్నారని కేకలు వేయడంతో ఎక్కడి వారు అక్కడ పారిపోయారు. తీరా సూచ్తే తమకిచ్చింది నకిలీ బంగారం అని తెలుసుకున్న బాధితులు చక్రపాణి, మస్తాన్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు బావాజాన్, నవీన్పాల్, సిద్ధలయ్య అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 7 లక్షల రూపాయలను స్వాదీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇదివరకు కూడా చాలా మందిని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.