అమరావతి- ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రజకీయం భలే విచిత్రంగా సాగుతోంది. సొంత పార్టీ ఎంపీని ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ప్రతి పక్ష పార్టీలన్నీ విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో రాజకీయం రసకందాయంలో పడింది. నర్సాపురం వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. రఘురామ కృష్ణరాజు అరెస్ట్ ను ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇక ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్ట్ ను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. కరోనా వైఫల్యాలను ప్రశ్నించిన ఎంపీ రాఘురామ కృష్ణరాజును దేశద్రోహం కేసు వేస్తారా అని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు ప్రశ్నించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కక్ష సాధింపు చర్యలే ముఖ్యమా అని ఆయన జగన్ సర్కార్ పై మండిపడ్డారు.
వైఎస్ జగన్ పరిపాలనలో ప్రశ్నించే వారినందరిని అరెస్టు చేయడం దారుణమని చంద్రబాబు ఫైర్ అయ్యారు. తమ పార్టీకి చెందిన ముఖ్య నేతలపై కూడా అనవసరంగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి వాడటం దుర్మార్గమైన చర్య అని బాబు విమర్శించారు. రాజకీయ కక్ష్య సాధింపులకు ఇది సమయం కాదని హితువు పలికిన చంద్రబాబు, కరోనా విజృంబిస్తున్న వేళ ప్రజల ప్రాణాలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సూచించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరిగిపోతున్న నేపధ్యంలో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.