తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల భూమా మౌనికను వివాహం చేసుకొని వార్తల్లో నిలిచారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష నేతలు ఇప్పటి నుంచే పలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక చేసే ప్రక్రియ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. మరోవైపు ఆశావాహుల, కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేవారు టికెట్ల కోసం క్యూలు కడుతుంటే.. స్థానిక నేతలు పార్టీ అధినేతలతో మంతనాలు చేస్తున్నారు. సినీ సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలు, క్రీడా రంగానికి చెందిన వారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అధికార, ప్రతిపక్ష పార్టీ తీర్థాలు పుచ్చుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మంచు మనోజ్ దంపతులు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే..
మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో హీరోగా తన సత్తా చాటాడు. ఇండస్ట్రీలో వివిధ రంగాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. గత కొంత కాలంగా మంచు మనోజ్ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో జగన్ పార్టీకి ప్రచారం కూడా చేశారు. ఈ మద్యనే భూమా నాగిరెడ్డి- భూమా శోభా దంపతుల రెండవ కుమార్తె భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మంచు మనోజ్ దంపతులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ భేటీపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా చర్చ జరుగుతుంది.
భూమా మౌనికా రెడ్డి కుటుంబం కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతోంది. మౌనిక సోదరి భూమా అఖిలప్రియ ప్రస్తుతం టీడీపీలో కీలక భూమిక పోషిస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే మంచు మనోజు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం ఇండస్ట్రీకి, రాజకీయలకు దూరంగా ఉన్నారు. ఇక భూమా మౌనిక రెడ్డి ని పెళ్లి చేసుకున్న తర్వాత రాజకీయాలపై మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు తో జరిగే భేటీలో రాజకీయాల గురించి చర్చించే అవకాశాలు ఉన్నట్లు మంచు, భూమా అభిమానులు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ వార్త చూసిన కొంతమంది వెల్ కమ్ టూ టీడీపీ .. మంచన్నా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు.